క్రైమ్ మిర్రర్ : నేపాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. పలు ప్రాంతాల్లో ఆకస్మిక వరదలు సంభవించడంతో గ్రామాలు, రహదారులు, వంతెనలు నీట మునిగాయి. టిబెట్ వైపు నుంచి వచ్చిన వరద నీటితో భోటేకోశీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తూ నువాకోట్, ధాడింగ్ జిల్లాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. వరద ప్రవాహం తీవ్రంగా ఉండటంతో పలు గ్రామాలు నీటిలో చిక్కుకున్నాయి. వంతెనలు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు సైతం వరద ఉద్ధృతికి దెబ్బతిన్నాయి. రసువా జిల్లాలో పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారింది. బుధవారం ఉదయం నాటికి సుమారు 1,000 మంది వరద ప్రవాహంలో గల్లంతైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. గల్లంతైన వారిలో 105 మంది భారతీయులు ఉన్నట్లు సమాచారం. దీంతో వారి ఆచూకీ కోసం కూడా అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలను ముమ్మరం చేశారు.
రంగంలోకి 15 హెలికాప్టర్లు
సహాయక చర్యలను వేగవంతం చేసేందుకు అధికారులు 15 హెలికాప్టర్లను రంగంలోకి దించారు. బుసి, తుసు ప్రాంతాల్లో సహాయక సిబ్బంది ఇప్పటివరకు 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. గాయపడిన వారిని మచిలి ట్రైనింగ్ క్యాంప్కు తరలించి వైద్యం అందిస్తున్నారు. మరోవైపు వరదల్లో గల్లంతైన వారి కోసం గాలింపు కొనసాగుతోంది. ఇప్పటివరకు 8 మృతదేహాలను అధికారులు వెలికితీసినట్లు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. నదుల పరివాహక ప్రాంతాల్లో పరిస్థితులు ప్రమాదకరంగా మారిన నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఎలాంటి ప్రమాదం ఎదురుకాకముందే లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు.
also read : హైదరాబాద్లో ‘డిజిటల్ అరెస్ట్’ మోసం.. 85 ఏళ్ల రిటైర్డ్ బ్యాంక్ ఉద్యోగికి షాక్
