-
సీనియర్ నేత చిన్నారెడ్డి పై ఎమ్మెల్యే మేఘారెడ్డి ఫిర్యాదు
-
జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో పాటు మీనాక్షి నటరాజన్ కు వినతి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: వనపర్తి కాంగ్రెస్ లో తలెత్తిన విభేదాలు ఢిల్లీకి తాకాయి. ఆ పార్టీ సీనియర్ నేత చిన్నారెడ్డి చేసిన కామెంట్స్ తెలంగాణ అధికార పార్టీలో సెగలు పుట్టించాయి. జీవన్ రెడ్డి మాదిరిగా తాను కూడా పార్టీ హై కమాండ్ పై తిరుగుబాటు చేస్తానని చిన్నారెడ్డి హెచ్చరించిన సంగతి తెలిసిందే.
స్థానిక ఎమ్మెల్యే మేఘారెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు చిన్నారెడ్డి. వచ్చే ఎన్నికల్లో వనపర్తిలో తానే బరిలో ఉంటానని ప్రకటించారు. ఈ తరుణంలో చిన్నారెడ్డి పై మేఘారెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేకు ఫిర్యాదు చేశారు.
చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆడియో ఆధారాలు, వాయిస్ రికార్డింగ్ లను సైతం ఖర్గేకు సమర్పించారు. ఎఐసిసి ప్రధాన కార్యదర్శి కేసి వేణుగోపాల్, రాష్ట్ర ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కు సైతం ఫిర్యాదు చేశారు.
-
సీనియర్ మోస్ట్ లీడర్..
వనపర్తి నియోజకవర్గం నుంచి సుదీర్ఘకాలం ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీలో అత్యంత సీనియర్ నేతగా కూడా గుర్తింపు పొందారు. అయితే మొన్నటి ఎన్నికల్లో మేఘారెడ్డికి అవకాశం కల్పించింది హై కమాండ్. ఆయన విజయం సాధించారు. అప్పటి నుంచి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మేఘారెడ్డికి, చిన్నారెడ్డికి మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది.
అయితే ఇటీవల సంచలన ఆరోపణలు చేశారు చిన్నారెడ్డి. కాంగ్రెస్ పార్టీ టికెట్ ను మేఘారెడ్డి డబ్బులు ఇచ్చి కొనుక్కున్నారు అంటూ ఆరోపించారు. దీనిపై టిపిసిసి క్రమశిక్షణ కమిటీ స్పందించింది. చిన్నారెడ్డికి నోటీసులు కూడా జారీ చేసింది. మరోవైపు చిన్నారెడ్డి పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎమ్మెల్యే వర్గీయులు గాంధీ భవన్ ఎదుట ఆందోళనకు దిగారు.
-
నిరంజన్ రెడ్డితో జత..
అయితే ఇప్పుడు వనపర్తి నియోజకవర్గం లో జరుగుతున్న రాజకీయం అధికార కాంగ్రెస్ పార్టీలో కొత్త వివాదానికి కారణం అవుతోంది. అయితే ఇక్కడ గులాబీ పార్టీకి బలమైన నేతగా మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి ఉన్నారు. ఆయనతో కలిసి చిన్నారెడ్డి తనపై కుట్ర చేస్తున్నారు అంటూ ఎమ్మెల్యే మేఘారెడ్డి ఆరోపిస్తున్నారు. మరోవైపు చిన్నారెడ్డి సైతం తాను జీవన్ రెడ్డి బాటలో నడుస్తానంటూ ప్రకటన చేశారు.
ఈ వివాదం ఇలానే ముదిరితే చిన్నారెడ్డి గులాబీ పార్టీలో చేరే అవకాశం ఉన్నట్లు కూడా ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే వనపర్తి లో ప్రారంభమైన ఈ విభేదాల పర్వం.. ఇప్పుడు ఢిల్లీకి తాకింది. మరి హై కమాండ్ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
