ఖరీదైన వస్తువులపై ఉన్న మోజు చివరకు ఓ కుటుంబంలో విషాదాన్ని నింపింది. కేరళలోని అలప్పుజ జిల్లా కరువట్టాలో 65 ఏళ్ల వృద్ధుడు హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. ఈ కేసులో మృతుడి 13 ఏళ్ల మనవరాలు సహా నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
పోలీసుల వివరాల ప్రకారం.. ఖరీదైన ఐఫోన్, లగ్జరీ బైక్లు కొనుగోలు చేయాలనే ఆలోచనతో బాలిక తన తాత శివంకుట్టిని హత్య చేయడానికి ముగ్గురు మైనర్ బాలుర సహాయం తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఘటన సమయంలో వృద్ధుడి చేతులు, కాళ్లు కట్టేసి అనంతరం ఉరిబిగించి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
హత్య అనంతరం ఇంట్లో ఉన్న బంగారం, నగదును తీసుకుని నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు కుటుంబ సభ్యులను విచారించడంతో పాటు బాలిక ప్రవర్తనపై కూడా దృష్టి సారించారు. ఆమె చెప్పిన వివరాల్లో అనుమానాలు తలెత్తడంతో విచారణను మరింత లోతుగా చేపట్టగా ఘటనకు సంబంధించిన కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
ప్రస్తుతం నలుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకుని ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. హత్య వెనుక అసలు కారణాలు, డబ్బు మరియు విలువైన వస్తువుల కోసం జరిగిన ప్రణాళికపై దర్యాప్తు కొనసాగుతోంది.
also read: కశ్మీర్లోకి 10 వేల మంది ఉగ్రవాదుల చొరబాటు? పాక్ మతబోధకుడి సంచలన వ్యాఖ్యలు
