ఆంధ్రప్రదేశ్లో క్రీడా రంగ అభివృద్ధికి మరో కీలక అడుగు పడింది. ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు పేరుతో ఏర్పాటు చేయనున్న సెంటర్ ఫర్ స్పోర్ట్స్ ఎక్స్లెన్స్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. బుధవారం ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భూమిపూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి క్రీడాకారిని పీవీ సింధు, ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, శాప్ చైర్మన్ రవి నాయుడు, ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావుతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు హాజరయ్యారు.
క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి శిక్షణ అందించే లక్ష్యంతో ఈ స్పోర్ట్స్ సెంటర్ను అభివృద్ధి చేయనున్నారు. యువ ప్రతిభను వెలికితీసేందుకు, రాష్ట్రంలో క్రీడా మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.
భారత బ్యాడ్మింటన్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పీవీ సింధు పేరుతో ఏర్పాటవుతున్న ఈ సెంటర్ భవిష్యత్ క్రీడాకారులకు ప్రోత్సాహంగా నిలవనుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ, సౌకర్యాలు అందుబాటులోకి వస్తే ఏపీ నుంచి మరింత మంది ప్రతిభావంతులైన ఆటగాళ్లు ఎదిగే అవకాశం ఉందని క్రీడాభిమానులు అభిప్రాయపడుతున్నారు.
also read: భార్య ఫిర్యాదు చేసిందని మనస్తాపం.. పోలీస్స్టేషన్లోనే భర్త ఆత్మహత్యాయత్నం
