క్రైం మిర్రర్ : మృతదేహాన్ని తరలించే సమయంలో ఓ అంబులెన్స్ డ్రైవర్ వ్యవహరించిన తీరు విమర్శలకు దారితీసింది. కుటుంబ సభ్యులు విషాదంలో ఉన్న పరిస్థితిని ఆసరాగా చేసుకుని మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజులను అపహరించిన ఘటన కడప నగరంలో వెలుగులోకి వచ్చింది. వివరాల ప్రకారం.. అన్నమయ్య జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో కడప నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. ఆస్పత్రిలో అవసరమైన ప్రక్రియలు పూర్తయ్యాక కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అంబులెన్స్ను ఏర్పాటు చేసుకున్నారు. మృతురాలి కుమారుడు అదే అంబులెన్స్లో తల్లి మృతదేహం పక్కన కూర్చుని స్వగ్రామానికి వెళ్తున్నాడు. ఈ సమయంలో అంబులెన్స్ డ్రైవర్ మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజులను గమనించినట్లు తెలుస్తోంది. వాటిని తీసుకునేందుకు మార్గమధ్యంలో పథకం వేసినట్లు సమాచారం.
ప్రయాణంలో భాగంగా వాహనాన్ని ఓ చోట ఆపి, తనకు దాహంగా ఉందని మృతురాలి కుమారుడికి చెప్పి వాటర్ తీసుకురావాలని కోరాడు. దీంతో షాపుకు వెళ్లిన వ్యక్తిని గమనించి అదే సమయంలో మృతురాలి చేతికి ఉన్న బంగారు గాజులను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం కుటుంబ సభ్యులకు అనుమానం రావడంతో విషయం బయటపడింది. ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ చేపట్టారు. అంబులెన్స్ డ్రైవర్ ప్రవర్తనపై స్థానికంగా ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశం ఉంది.
also read :‘ఎందుకు ఈ నిర్ణయం తీసుకున్నానో చెప్పలేను’.. విద్యార్థి సూసైడ్ నోట్ వెలుగులోకి