నవీ ముంబైలో సంచలనం రేపిన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. 11 నెలల క్రితం అదృశ్యమైన వ్యక్తి కేసులో షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. భర్తను హత్య చేసి, అతడు కనిపించకుండా పోయాడని నమ్మించిన భార్యే ఈ ఘటనకు ప్రధాన నిందితురాలిగా తేలింది.
మహారాష్ట్రలోని నవీ ముంబైలో బలిరామ్ (50) అనే వ్యక్తి అదృశ్యమైన కేసు ఊహించని మలుపు తిరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. బలిరామ్ భార్య సునీత (40), తన ఆటోడ్రైవర్ ప్రియుడు రాహుల్ కలిసి ఈ హత్యకు పాల్పడినట్లు దర్యాప్తులో తేలింది. అక్రమ సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని భావించిన సునీత, రాహుల్తో కలిసి గత ఏడాది ఆగస్టులో బలిరామ్ను హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు చేసి అడవిలో పడేసినట్లు విచారణలో వెల్లడైంది.
హత్య అనంతరం బలిరామ్ ఇంటి నుంచి వెళ్లిపోయాడని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించే ప్రయత్నం చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే చాలా కాలం పాటు ఎలాంటి సమాచారం లేకపోవడంతో అనుమానం వచ్చిన బలిరామ్ సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. ఫోన్ కాల్ రికార్డులు, ఇతర ఆధారాలను పరిశీలించి కీలక విషయాలను గుర్తించారు. విచారణలో నిందితులపై అనుమానం బలపడటంతో సునీత, రాహుల్ను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.
ఈ ఘటన నవీ ముంబై పరిధిలో తీవ్ర కలకలం రేపింది. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేసి, మరిన్ని వివరాల కోసం దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: Amaravati Assigned Lands Case: సీఎం చంద్రబాబు, మంత్రి నారాయణకు హైకోర్టు భారీ ఊరట.. CID కేసు రద్దు