అమరావతి అసైన్డ్ భూముల వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మంత్రి పొంగూరు నారాయణకు హైకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరిపై ఏపీ సీఐడీ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టివేస్తూ కీలక తీర్పు ఇచ్చింది.
అమరావతి రాజధాని ప్రాంతంలో అసైన్డ్ భూముల లావాదేవీలకు సంబంధించి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ సమయంలో సీఐడీ కేసు నమోదైంది. ఈ కేసులో చంద్రబాబును మొదటి నిందితుడిగా, నారాయణను రెండో నిందితుడిగా పేర్కొన్నారు. 2021 ఫిబ్రవరి 24న అప్పటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ విచారణ ప్రారంభించింది. అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్లు, ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టంలోని నిబంధనల కింద కేసు నమోదు చేశారు.
తమపై నమోదైన కేసును రద్దు చేయాలని కోరుతూ చంద్రబాబు, నారాయణ హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. సీఐడీ నమోదు చేసిన కేసులోని అంశాలను పరిశీలించి దానిని కొట్టివేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో అమరావతి అసైన్డ్ భూముల కేసులో చంద్రబాబు, నారాయణకు న్యాయపరంగా ఊరట లభించినట్లైంది. ఈ తీర్పు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
also read: వేముల ప్రశాంత్ రెడ్డి హౌస్ అరెస్ట్.. ఇంట్లోనే నిరాహార దీక్ష, పోలీసుల ఆంక్షలపై ఆగ్రహం