Homeఅంతర్జాతీయంSheikh Hasina: మరణశిక్ష విధించినా స్వదేశానికే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

Sheikh Hasina: మరణశిక్ష విధించినా స్వదేశానికే.. షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు!

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని, ఆవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనా ఈ ఏడాది డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వెళ్లాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. విద్యార్థుల ఉద్యమం, హింసాత్మక నిరసనల తర్వాత ఆమెతో పాటు ఆవామీ లీగ్‌కు చెందిన పలువురు నాయకులు భారత్‌కు వచ్చిన విషయం తెలిసిందే. ఆ పరిణామాల అనంతరం బంగ్లాదేశ్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటైంది. ఆందోళనల సమయంలో జరిగిన మరణాలకు షేక్ హసీనా బాధ్యురాలని అక్కడి ప్రత్యేక ట్రైబ్యునల్ తేల్చింది. ఈ కేసులో ఆమెకు మరణశిక్ష విధించగా, అప్పటి హోం మంత్రికీ అదే శిక్షను ఖరారు చేసింది.

ఈ నేపథ్యంలోనూ తాను స్వదేశానికి వెళ్లాలనే నిర్ణయాన్ని మార్చుకోలేదని షేక్ హసీనా తెలిపారు. తనతో పాటు విదేశాల్లో ఉన్న ఆవామీ లీగ్ నేతలు కూడా తిరిగి బంగ్లాదేశ్‌కు వెళ్లే అవకాశముందని చెప్పారు. అక్కడికి వెళ్లిన తర్వాత కోర్టు ముందు లొంగిపోతానని, అధికారులు తనను అరెస్టు చేయవచ్చని ఆమె అన్నారు. అంతేకాదు, తన ప్రాణాలకు ముప్పు ఉండొచ్చని కూడా ఆమె పేర్కొన్నారు. తనను చంపే ప్రయత్నం జరిగినా స్వదేశానికి వెళ్లాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఆవామీ లీగ్‌పై నిషేధం అమల్లో ఉందని, దేశానికి చేరుకున్న తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేయాలని డిమాండ్ చేస్తానని తెలిపారు.

ప్రస్తుత ప్రభుత్వం తమ పార్టీ నాయకులు, కార్యకర్తలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తోందని షేక్ హసీనా ఆరోపించారు. బంగ్లాదేశ్‌లో మళ్లీ ప్రజాస్వామ్య వ్యవస్థను బలోపేతం చేయడం, సాధారణ రాజకీయ పరిస్థితులను పునరుద్ధరించడమే తన ప్రధాన లక్ష్యమని చెప్పారు. అయితే, తాను తిరిగి బంగ్లాదేశ్ వెళ్లే విషయంపై అక్కడి అధికారులతో ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్చలు జరగలేదని ఆమె స్పష్టం చేశారు. పరిస్థితులు ఎలా ఉన్నా స్వదేశానికి వెళ్లాలనే తన నిర్ణయం మాత్రం యథాతథంగా ఉందని మరోసారి వెల్లడించారు.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు