Crime Mirror, Latest Updates: మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎన్సీపీ(ఎస్పీ) అధినేత శరద్ పవార్, మహరాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గడిచిన కొద్ది నెలలుగా మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
శివసేన (యూబీటీ)కి చెందిన పలువురు ఎమ్మెల్యేలు షిండే వర్గంలో చేరిపోయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్సీపీ(ఎస్పీ)కి చెందిన ఎమ్మెల్యేలు కూడా పార్టీ మారతారన్న ఊహాగానాలు పెద్ద ఎత్తున వచ్చాయి. ఇదే సమయంలో శివసేన(యూబీటీ) అధినేత ఠాక్రే కూడా కూటమిలోని ఇతర పార్టీలపై అసహనాన్ని వ్యక్తం చేస్తూ విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలో మహరాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఎన్సీపీ(ఎస్పీ) అదినేత శరద్ పవార్ భేటీ కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మహరాష్ట్ర – కర్ణాటక సరిహిద్దు వివాదంపై ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ అధ్యక్షతన అసెంబ్లీ భవనంలో కేబినెట్ భేటీ జరిగింది. ఈ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే హాజరయ్యారు.
అదే సమయంలో శరద్ పవార్ కూడా తన పార్టీకి చెందిన ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో షిండే కార్యాలయానికి వెళ్లి కలిశారు. పవార్ తన కార్యాలయంలో వేచి ఉన్నారన్న విషయం తెలుసుకున్న షిండే క్యాబినెట్ సమావేశాన్ని మధ్యలోనే ముగించుకుని వెళ్లి కలిశారు. పుష్పగుచ్ఛంతో ఆయనకు స్వాగతం పలికిన షిండే.. సుమారు 15 నిమిషాలపాటు ఇద్దరు చర్చించారు.
-
కీలక పరిణామాలుకు అవకాశం..
తాజాగా చోటుచేసుకున్న ఈ భేటీతో మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు జరిగే అవకాశం ఉందన్న విశ్లేషనలు వినిపిస్తున్నాయి. ఉద్ధవ్ థాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు షిండే వర్గంలో చేరారు. ఈ పరిణామంతో మహా వికాస్ అఘాడీ(ఎంవీఏ)లో ఇప్పటికే లుకలుకలు మొదలయ్యాయి.
అదే సమయంలో శరద్ పవార్ పార్టీలోని ఒక వర్గం కూడా ఎన్డీఏలో చేరుతుందన్న ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో జరిగిన ఈ భేటీ ప్రాఽధాన్యతను సంతరించుకుంది. కొద్దిరోజుల్లో మహరాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంటుందని చెబుతున్నారు. ఇకపోతే, ఈ భేటీపై యూబీటీ ముఖ్య నేత సంజయ్ రౌత్ కీలక ప్రశ్నలను సంధించారు.
షిండేను ఆయన కార్యాలయంలో కలవాల్సిన అవసరం ఏమొచ్చిందని, పవార్ తన నాయకులను కలవడానికి అసెంబ్లీలో చోటు లేదా అని ప్రశ్నించారు. అదే సమయంలో శరద్ పవార్ నిస్సందేహంగా గొప్ప నాయకుడు అని, అత్యంత గౌరవనీయమైన వ్యక్తి అని కొనియాడారు. అయితే, మన ప్రభుత్వాన్ని కూల్చివేసిన ద్రోహి సమక్షంలో పార్టీ సమావేశం నిర్వహించడం ఆయన స్థాయిని దెబ్బతీస్తుందని వ్యాఖ్యానించారు. మరి ఈ వ్యాఖ్యలపై ఎన్సీపీ నేతలు ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది.