•పార్లమెంట్ వర్షాకాల సమావేశాల షెడ్యూల్ జారీ
•కీలకమైన రెండు బిల్లుల దృష్ట్యా వాయిదా
•సెప్టెంబర్ మొదటి వారంలోనే విస్తరణ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్:-
కేంద్ర మంత్రివర్గ విస్తరణ పై రకరకాల ప్రచారం నడిచింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ఉంటుందన్న ప్రచారం జోరుగా సాగింది. మోదీ తన టీమ్ ను పూర్తిస్థాయిలో మార్చేస్తారని.. పనితీరు సరిగ్గా లేని మంత్రులను తొలగించి కొత్త ముఖాలకు, ముఖ్యంగా ఎన్డీఏ కూటమి భాగస్వామ్య పక్షాలకు పెద్దపీట వేస్తారని భావించారు. కానీ శనివారం కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజీజు వర్షాకాలం సమావేశాల అధికారిక షెడ్యూల్ను ప్రకటించారు. దీంతో ఇప్పట్లో మంత్రివర్గ విస్తరణ లేనట్టే. పార్లమెంట్ వేదికగా అత్యంత కీలకమైన సెషన్ నడవబోతున్న తరుణంలో.. ఈ లోపు క్యాబినెట్ విస్తరణ చేపట్టే సాహసం ప్రధాని మోదీ చేయడం లేదని.. మార్పులు చేర్పుల ప్రక్రియను ఆయన వ్యూహాత్మకంగా వాయిదా వేస్తారని అర్థం అవుతోంది.
వివాదాస్పదమైన బిల్లులు..
ఈ పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన, వివాదాస్పదమైన రాజ్యాంగ సవరణ బిల్లులను తీసుకురాబోతోంది. ముఖ్యంగా పీఎం, సీఎం ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించిన 130 వ రాజ్యాంగ సవరణ బిల్లుపై ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ.. జూలై 17న తన తుది నివేదికను సమర్పించనుంది. దీంతో పాటు వన్ నేషన్, వన్ ఎలక్షన్ బిల్లుపై కూడా ఉభయసభల్లో వాడి వేడి చర్చ జరగనుంది. ఇలాంటి అత్యంత సంక్లిష్టమైన చట్టాలు పాస్ కావాల్సిన సమయంలో మంత్రివర్గ విస్తరణ చేపట్టడం అనేది సరైన పద్ధతి కాదని వాయిదా వేసినట్లు తెలుస్తోంది..
బిజెపి సంస్థాగత మార్పులు సైతం..
తాజా పరిస్థితులు బట్టి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో మెగా క్యాబినెట్ విస్తరణ, బిజెపి సంస్థాగత మార్పులు ఏకకాలంలో జరిగే ఛాన్స్ కనిపిస్తోంది. ఇటీవల కొన్ని పరిణామాలు కూడా క్యాబినెట్ విస్తరణ పై మరింత కసరత్తు చేయాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. జూన్ చివరి వారంలో ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి ద్రౌపది మూర్ముతో భేటీ అయిన సంగతి తెలిసిందే. ఎంబీఏ ప్రభుత్వం మనుగడ, రాబోయే రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమీకరణలను బ్యాలెన్స్ చేయాల్సి ఉన్నందున.. తొందరపడి నిర్ణయం తీసుకోవడం కంటే.. సుదీర్ఘ కసరత్తు చేసి సెప్టెంబర్లో మంత్రివర్గ విస్తరణ చేపట్టాలన్నది ప్రధాని ఆలోచనగా తెలుస్తోంది. సెప్టెంబర్ వేదికగా టీం మోడీ లో భాగంగా భారీ మార్పులు, చేర్పులు ఉండబోతున్నాయి అనేది ఢిల్లీ వర్గాల అంచనా.