•భారీగా నేతల చేరిక కు స్కెచ్
•సీఎం రమేష్ కు బాధ్యతలు
•ఫ్యాన్ పార్టీలో ప్రకంపనలు
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో:- ఏపీ ఫై భారతీయ జనతా పార్టీ ప్రత్యేకంగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇక్కడ చేరికలను పెంచాలని చూస్తున్నట్లు సమాచారం. ఆ బాధ్యతను అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కు హై కమాండ్ అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే ఆయన సైతం బిజెపిలో చేరికలు పెరుగుతాయని ప్రకటించడంతో ఏదో జరుగుతోందన్న అనుమానం ప్రారంభం అయింది. ప్రధానంగా వైసీపీలో ఉన్న అసంతృప్త నాయకులను, ద్వితీయ శ్రేణి క్యాడర్ను బిజెపిలోకి రప్పించేందుకు సీఎం రమేష్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. మొన్ననే ఆయన పశ్చిమ బెంగాల్ లో తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలను బిజెపి వైపు తిప్పడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. అందుకే ఇప్పుడు ఏపీ బాధ్యతలను ఆయనకు హై కమాండ్ అప్పగించింది.
జనసేన చేరికల కమిటీ..
జనసేనలో ఇప్పటికే చేరికల కమిటీ ఏర్పాటు అయింది. ఇదంతా ఒక వ్యూహం ప్రకారమేనని తెలుస్తోంది. మిగతా రెండు పార్టీలతో పోల్చుకుంటే టిడిపి బలంగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో వైసీపీ నుంచి నేతలను చేర్పించుకుంటే టిడిపిలో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. అందుకే వ్యూహాత్మకంగా బిజెపిలోకి వైసీపీ నేతలను చేర్పించే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాయలసీమలో జనసేనలో చేరికల బాధ్యతలను మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి అప్పగించారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు కోస్తాంధ్రలో బిజెపిలో చేరికల బాధ్యతలను సీఎం రమేష్ చూస్తున్నారు. దీంతో భారీగా వైసీపీ నుంచి జంపింగ్లు ఉంటాయన్న ప్రచారం క్షేత్రస్థాయిలో జరుగుతోంది.
చర్చలు ప్రారంభం..
సీఎం రమేష్ అంటే తెలుగుదేశం పార్టీ నాయకత్వానికి అత్యంత దగ్గరగా ఉండే నేత.. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో విపరీతమైన ప్రభావం చూపారు. ఉత్తరాంధ్రలో కూటమి గెలిచేందుకు అవసరమైన వనరులను సమకూర్చారు. అందుకే ఈసారి బిజెపి ఆకర్ష భారీగా ఉండబోతుందన్న టాక్ వినిపిస్తోంది. దాదాపు అన్ని జిల్లాల నుంచి వైసీపీ కీలక నేతల చేరికలు ఉంటాయని బిజెపి వర్గాలు చెబుతున్నాయి. సీఎం రమేష్ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టారని.. వైసీపీ కీలక నేతలతో చర్చలు జరుపుతున్నారన్న టాక్ నడుస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఈ ప్రచారం ప్రకంపనలు రేపుతోంది.. చూడాలి మరి ఏం జరుగుతుందో..