ఫోక్ సాంగ్స్, డ్యాన్స్ ప్రదర్శనలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నాగదుర్గ ఇప్పుడు సినీ రంగంలో హీరోయిన్గా కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తోంది. ‘ఇడుపు కాయితం’ అనే చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అవుతుండగా, ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సోషల్ మీడియాలో కూడా నాగదుర్గ పేరు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉంది.
ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై నిర్మిస్తున్నారు. హీరోగా ప్రియదర్శి నటిస్తుండగా, నాగదుర్గ ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ యువతి పాత్రలో కనిపించనుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు సినిమాపై మంచి హైప్ తీసుకురాగా, టైటిల్ కూడా చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల ఇంటర్వ్యూలతో ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్న నాగదుర్గ తన వ్యక్తిగత విషయాలను కూడా పంచుకుంది. ముఖ్యంగా బిగ్బాస్ తెలుగు షో నుంచి వచ్చిన ఆఫర్ గురించి ఆమె చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి. ఆ షో నుంచి అవకాశం వచ్చిన మాట నిజమేనని వెల్లడించిన ఆమె, తాను ఆ ఫార్మాట్కు సరిపోనని భావించి ఆ అవకాశాన్ని గౌరవంగా తిరస్కరించినట్లు తెలిపింది.
“నాకు భయం అనే విషయం లేదు. కానీ బిగ్బాస్ హౌస్లో ఉండే పరిస్థితులకు నేను సెట్ కాను అనిపించింది. నేను చాలా సైలెంట్గా ఉంటాను. ఎవరికైనా ‘నో’ చెప్పడం కూడా కష్టం. నా భావాల కంటే ఎదుటివారి భావాలనే ఎక్కువగా ఆలోచిస్తాను. కొన్ని సందర్భాల్లో వాళ్లను బాధ పెట్టకూడదనే ఉద్దేశంతో నేనే బాధపడిన సందర్భాలు ఉన్నాయి” అని ఆమె చెప్పింది.
కుటుంబ సభ్యుల సలహాలు కూడా ఈ నిర్ణయంలో కీలక పాత్ర పోషించాయని నాగదుర్గ వెల్లడించింది. తాను ఎమోషనల్గా ఉండే స్వభావం వల్ల బిగ్బాస్ హౌస్లోని పరిస్థితులను ఎలా ఎదుర్కొంటావో ఆలోచించమని తన తల్లి సూచించగా, కనీసం కొన్ని వారాలైనా పాల్గొంటే ప్రేక్షకులకు దగ్గరవుతావని తండ్రి అభిప్రాయం వ్యక్తం చేశారని తెలిపింది.
అయితే ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని నాగదుర్గ స్పష్టం చేసింది. హీరోయిన్గా మంచి అవకాశాలు అందుకోవాలనే లక్ష్యంతో, ఒకేసారి రెండు విషయాలపై దృష్టి పెట్టకుండా స్పష్టమైన నిర్ణయం తీసుకున్నానని ఆమె పేర్కొంది. గతంలో కూడా కొన్ని సినిమాల్లో అవకాశాలు వచ్చినప్పటికీ, నాట్యంపై దృష్టి పెట్టాలనే ఉద్దేశంతో వాటిని వదులుకున్నట్లు వార్తలు వినిపించాయి. ఇప్పుడు మాత్రం హీరోయిన్గా తన ప్రతిభను నిరూపించుకోవాలని నాగదుర్గ సిద్ధమవుతోంది. ఫోక్ డ్యాన్సర్గా ప్రారంభమైన ఈ ప్రయాణం, హీరోయిన్గా ఎక్కడికి తీసుకెళ్తుందో చూడాలి. ప్రేక్షకులు మాత్రం ఆమె తొలి సినిమాపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
also read: శంషాబాద్ ఎయిర్పోర్ట్లో భారీ వీసా మోసం… ఒమన్ ప్రయాణానికి నకిలీ వీసాలతో 20 మంది మహిళలు!