-
హద్దు దాటితే పాత్రను రిజక్ట్ చేయాలి..
-
జాన్వీ పాత్రపై నిత్యా మీనన్ రియాక్షన్.!
రామ్ చరణ్, జాన్వీ కపూర్ జంటగా నటించిన పెద్ది సినిమా సక్సెస్పుల్గా నడుస్తోంది. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనపై ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే హీరోయిన్ జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ పాత్రపై మాత్రం పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా అచ్చియ్యమ్మ పాత్రను తెరపై చూపించిన విధానాన్ని ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు జాన్వీ పాత్రపై స్పందించారు.
జాన్వీని చూపించిన విధానం అభ్యంతరకంగా ఉందంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై వెంటనే స్పందించిన దర్శకుడు బుచ్చిబాబు మహిళలకు క్షమాపణలు చెప్పడంతోపాటు కొన్ని సీన్లను తొలగిస్తామని ప్రకటించారు. అయినపప్పటికీ ఈ వివాదం కొనసాగుతూనే వస్తోంది.
సాధారణ ప్రేక్షకులు మాత్రమే కాకుండా హీరోయిన్లు కూడా జాన్వీని అభ్యంతరకరంగా చూపించారని తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పలువురు సినీ తారలు స్పందించి జాన్వీకి అండగా నిలిచారు. తాజాగా స్టార్ హీరోయిన్ నిత్యా మీనన్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఆట బొమ్మలా చూపించడాన్ని వ్యతిరేకిస్తానన్న నిత్యా..
తెరపై మహిళలను ఒక ఆట బొమ్మలా చూపించడాన్ని తాను వ్యతిరేకిస్తున్నట్టు నిత్యా మీనన్ వెల్లడించారు. తాను పెద్ది సినిమా చూడనప్పటికీ.. జాన్వీ కపూర్కు తన మద్ధతు ఉంటుందన్నారు. సినిమాల్లో మహిళలను వస్తువులా చూపించడం కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమకే పరిమితం కాదన్న నిత్యా మీనన్.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినిమాల్లో ఇదో ప్రధాన సమస్యగా మారిందని అభిప్రాయపడ్డారు.
వాణిజ్యపరమైన అంశాలను జత చేయాలనే ఒత్తిడితో మహిళా పాత్రలను శృతిమించి చూపిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో హీరోయిన్లే స్వీయ నియంత్రణ పాటించాలని సూచించిన నిత్యా మీనన్.. పాత్ర హద్దు దాటినట్టు అనిపిస్తే వెంటనే రిజక్ట్ చేయాలని సూచించారు. తమను తెరపై ఒక వస్తువులా చూపిస్తున్నారనే అనుమానం కలిగితే వెంటనే నో చెప్పేయాలంటూ సహచర నటీమణులకు సలహా ఇచ్చారు.
ఇక పెద్ది సినిమా విషయానికి వస్తే విడుదలైన తొలి రోజు నుంచి మంచి టాక్తో విజయవంతంగా సినిమా నడుస్తోంది. మూడు రోజుల్లోనే ఈ చిత్రం సుమారు రూ.250 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు సాధించి సత్తా చాటుతోంది.