అమెరికాలో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న విదేశీ నిపుణులకు, ముఖ్యంగా భారతీయ టెక్కీలకు కీలక ఉపశమనం లభించింది. హెచ్1బీ వీసా పొందాలనుకునే అభ్యర్థులపై గతంలో విధించిన భారీ ఆర్థిక భారం నుంచి వారికి ఊరట కలిగేలా అమెరికా ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. హెచ్1బీ వీసా దరఖాస్తుదారులపై డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం విధించిన 1,00,000 డాలర్ల ఫీజును పూర్తిగా రద్దు చేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టు సంచలన నిర్ణయం తీసుకుంది. భారత కరెన్సీలో ఇది సుమారు రూ.84 లక్షలకు సమానం కావడం గమనార్హం. ఈ ఫీజు విధింపుకు అధ్యక్షుడికి చట్టపరమైన అధికారం లేదని స్పష్టం చేసిన న్యాయస్థానం, దీనిని అనధికారిక పన్నుగా అభివర్ణిస్తూ చెల్లదని తేల్చిచెప్పింది.
ఈ వివాదానికి గత ఏడాది సెప్టెంబర్లో ట్రంప్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే కారణమైంది. విదేశాల్లో ఉంటూ హెచ్1బీ వీసాకు ఎంపికైన నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేయాలంటే తప్పనిసరిగా 1,00,000 డాలర్ల భారీ ఫీజు చెల్లించాలనే నిబంధనను అప్పట్లో ప్రభుత్వం తీసుకొచ్చింది. అమెరికా స్థానిక ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు, విదేశీ నిపుణుల ప్రవాహాన్ని నియంత్రించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. అయితే ఇంత భారీ మొత్తాన్ని ఫీజుగా నిర్ణయించడంపై వలస నిపుణులు, వ్యాపార వర్గాలు, పలు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. చివరకు అమెరికాలోని 20 రాష్ట్రాల అటార్నీ జనరల్స్ ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ బోస్టన్ ఫెడరల్ కోర్టును ఆశ్రయించారు.
పిటిషన్లపై విచారణ జరిపిన జడ్జి లియో సొరొకిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఫీజు సాధారణ పరిపాలనా రుసుము కాదని, ఇది వాస్తవానికి ఒక రకమైన పన్ను అని ఆయన పేర్కొన్నారు. అమెరికా రాజ్యాంగం ప్రకారం పన్నులు విధించే అధికారం కాంగ్రెస్కు మాత్రమే ఉంటుందని, కాంగ్రెస్ ఆమోదం లేకుండా అధ్యక్షుడు స్వతంత్రంగా ఇలాంటి ఆర్థిక భారం మోపలేరని తీర్పులో స్పష్టం చేశారు. అందువల్ల ట్రంప్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ నిబంధన చట్టబద్ధం కాదని, రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తేల్చింది.
ఈ తీర్పుతో భారతీయ నిపుణులకు భారీ ఊరట లభించినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రతి సంవత్సరం అమెరికా జారీ చేసే హెచ్1బీ వీసాలలో అత్యధిక వాటా భారతీయ టెకీలకే దక్కుతుంది. లక్ష డాలర్ల ఫీజు అమల్లోకి వచ్చి ఉంటే వేలాది మంది ప్రతిభావంతులైన భారతీయులు అమెరికాలో ఉద్యోగ అవకాశాలను కోల్పోయే ప్రమాదం ఉండేది. అలాగే వారిని నియమించుకోవాలనుకునే సంస్థలపై కూడా అదనపు ఆర్థిక భారం పడేది. విదేశీ ప్రతిభపై ఆధారపడే అమెరికా ప్రముఖ సాంకేతిక సంస్థలు కూడా ఈ నిర్ణయం వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడేది.
ఫెడరల్ కోర్టు తాజా తీర్పుతో వలస నిపుణులు మాత్రమే కాకుండా అమెరికా కార్పొరేట్ రంగం కూడా ఊపిరి పీల్చుకుంది. విదేశీ ప్రతిభను ఆకర్షించడంలో అమెరికాకు ఉన్న పోటీ సామర్థ్యాన్ని ఈ తీర్పు కాపాడిందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా ఉద్యోగ అవకాశాల మార్గంలో ఏర్పడిన ఒక పెద్ద అడ్డంకి తొలగిపోయినట్లుగా భావిస్తున్నారు.
ALSO READ: బ్యాంకులో బంగారం మాయం