-
రాజ్యసభకు తన పేరు పరిగణలోకి తీసుకోకపోవడం పై ఆవేదన
-
హై కమాండ్ పై ఆగ్రహం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీమంత్రి యనమల రామకృష్ణుడు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు ప్రచారం నడుస్తోంది. ఏపీ నుంచి రాజ్యసభ పదవుల విషయంలో తన పేరు పరిగణలోకి తీసుకోకపోవడం పై ఆయన తీవ్ర కలత చెందినట్లు సమాచారం. ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సభ్యుల పదవీకాలం ముగిస్తున్న నేపథ్యంలో ఎన్నికలు జరగనున్నాయి. టిడిపికి మూడు, జనసేనకు ఒక రాజ్యసభ పదవి దక్కనుంది. జనసేన నుంచి ప్రముఖ పారిశ్రామికవేత్త లింగమనేని రమేష్ పేరును ఖరారు చేశారు. టిడిపి విషయంలో సైతం స్పష్టంగా వచ్చినట్లు తెలుస్తోంది.
చివరిగా కుల సమీకరణలు..
తెలుగుదేశం పార్టీకి మూడు రాజ్యసభ పదవులు దక్కగా.. అందులో సానా సతీష్ కు మరోసారి రెన్యువల్ లభించింది. ఇంకా రెండు పదవులకు సంబంధించి భాష్యం రామకృష్ణ పేరు ఖరారు అయింది. చివరిగా మిగిలిన రాజ్యసభ పదవి కోసం రకరకాల సమీకరణలను తెరపైకి తీసుకొస్తున్నారు. బీసీలకు ఇవ్వాలనుకుంటే స్పీకర్ అయ్యన్నపాత్రుడు కుమారుడు విజయ్ కు.. ఎస్సీలకు ఇవ్వాలనుకుంటే వర్ల రామయ్యకు ఇస్తారని ప్రచారంలో ఉంది.
అయితే చివరకు వర్ల రామయ్య వైపే చంద్రబాబు మొగ్గు చూపుతారని పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఇప్పటికే స్పీకర్ గా అయ్యన్నపాత్రుడు ఉన్న నేపథ్యంలో.. ఆయన కుమారుడు కి రాజ్యసభ పదవి ఇవ్వడం ఏంటనేది పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. యనమల రామకృష్ణుడు అసంతృప్తికి కూడా ఇదే కారణం.
రాజ్యసభకు వెళ్లాలన్నది కోరిక..
తెలుగుదేశం పార్టీలో అన్ని పదవులు అనుభవించారు యనమల రామకృష్ణుడు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా, శాసనసభ స్పీకర్ గా ఇలా పదవులన్నింటినీ సొంతం చేసుకున్నారు. కానీ పార్లమెంట్ సభ్యుడిగా రాజ్యసభలో అడుగు పెట్టాలన్నది యనమల చివరి కోరిక.
కానీ చంద్రబాబు మాత్రం ఆయన పేరును పరిగణలోకి తీసుకోకపోవడంతో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. టిడిపిలో గౌరవప్రదమైన పదవీ విరమణ కోరుకుంటే.. కనీసం నాయకత్వం పట్టించుకోకపోవడంపై ఆయన ఆవేదనతో సమాచారం. మరి యనమల ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.