-
బండి సంజయ్ కొత్త పార్టీ…!
-
అన్నామలై ఎపిసోడ్ తర్వాత ఊపందుకుంటున్న ప్రచారం
-
ఇద్దరిదీ ఒకటే పరిస్థితి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: బండి సంజయ్ సొంతంగా పార్టీ పెడతారా? బిజెపికి గుడ్ బై చెబుతారా? తమిళనాడులో బిజెపి మాజీ అధ్యక్షుడు అన్నామలై బిజెపికి గుడ్ బై చెప్పడంతో సరికొత్త చర్చ ప్రారంభం అయింది. తమిళ జాతీయవాదం అజెండాతో సరికొత్త ప్రాంతీయ వేదికను స్థాపించడం జాతీయ స్థాయిలో కూడా ప్రకంపనలు సృష్టించింది.
ఈ పరిణామంతో తెలంగాణలో బిజెపి మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నామలై తరహాలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందన్న ప్రచారం మొదలైంది. అన్నా మలై ఎపిసోడ్ బండి సంజయ్ కు దగ్గరగా ఉంటుంది. బిజెపి అగ్రనేతల నిర్ణయంతో అన్నామలై కంటే ముందు బండి సంజయ్ అన్యాయం అయిపోయారు.
దగ్గరి పోలికలు..
అన్నామలై తో బండి సంజయ్ కు దగ్గరి పోలికలు ఉంటాయి. ఇద్దరూ దూకుడు కలిగిన నేతలే. హిందుత్వ లైన్, మాస్ ఇమేజ్ కలిగిన వారే. తెలంగాణలో బిజెపికి వరుస విజయాలు దక్కుతున్న సమయంలోనే బండి సంజయ్ ను రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. నిజమైన బిజెపి శ్రేణులకు అప్పట్లో ఇది నిరాశ కలిగించే విషయం. తమిళనాడులో అన్నామలై విషయంలోనూ ఢిల్లీ పెద్దలు ఇదే మాదిరిగా వ్యవహరించారు.
రాష్ట్రంలో కూటమి కట్టేందుకు అన్నమలై ను కట్టడి చేశారు. అదే ఆయన తిరుగుబాటుకు కారణం. బండి సంజయ్ విషయంలో కూడా బిజెపి శ్రేణులకు అటువంటి అభిప్రాయమే ఉంది. అందుకే బండి సంజయ్ సైతం తీవ్ర నిర్ణయం దిశగా అడుగులు వేస్తారన్న ప్రచారం తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో ఉంది.
అసలు లక్ష్యం తీరక..
బండి సంజయ్ ను బుజ్జగించేందుకు కేంద్ర సహాయ మంత్రి పదవి ఇచ్చారు. కానీ బండి సంజయ్ లక్ష్యం మాత్రం తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడం. అయితే ఎప్పుడైతే బండి సంజయ్ ను బిజెపి తప్పించిందో.. అప్పటినుంచి బిజెపిలో గ్రూపుల గోల మొదలైంది. ఒకప్పుడు ఫైర్ బ్రాండ్ గా ఉండే బండి సంజయ్ ఢిల్లీ వ్యవహారాలకి పరిమితం అయ్యారు. ఆయనకు కావాలనే రాష్ట్ర రాజకీయాల్లో పరిమితం చేశారు.
అది ఆయనలో అసహనంతో పాటు అసంతృప్తికి కారణం. ఢిల్లీ పెద్దలు తరచూ తనను నియంత్రిస్తుండడాన్ని తట్టుకోలేకపోతున్నారు. అందుకే అన్నామలై తరహాలో బండి సంజయ్ కొత్తగా పార్టీ పెడతారు అనే చర్చ తెలంగాణ సర్కిల్స్ లో జరుగుతోంది. మొన్నటికి మొన్న కుమారుడి ఎపిసోడ్ తో ఈ చర్చ పెద్ద ఎత్తున సాగింది. ఇప్పుడు అన్నామలై గుడ్ బై చెప్పడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది.