ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతల కారణంగా చమురు ధరలు, ఇంధన సంక్షోభంపై తీవ్ర చర్చ జరుగుతున్న వేళ, కర్ణాటక రాష్ట్రంలోని తీరప్రాంత నగరం మంగళూరులో వెలుగులోకి వచ్చిన ఒక ఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేస్తోంది. నగరంలోని కావూర్ ప్రాంతంలో ఉన్న మూడు ఇళ్ల బావుల నుంచి అకస్మాత్తుగా నీటికి బదులుగా డీజిల్ బయటకు రావడం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. సాధారణంగా తాగునీటి కోసం ఉపయోగించే బావుల్లో నుంచి ఇంధన వాసన రావడంతో స్థానికులు మొదట ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం బావి నీటిపై మందపాటి చమురు పొర తేలియాడుతుండటంతో విషయం బయటపడింది.
ఈ ఘటనపై అధికారులు నీటి నమూనాలను సేకరించి ప్రయోగశాలకు పంపగా నివేదికల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పరీక్షల్లో బావి నీటిలో ఇతర మలినాలు లేకపోయినా, దాదాపు 28 శాతం స్వచ్ఛమైన డీజిల్ ఉన్నట్లు తేలింది. దీంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. బావి నుంచి తీసిన నీటిలో ఒక కాగితాన్ని ముంచి నిప్పు పెట్టగానే అది ఇంధనం పోసినట్లుగా ఒక్కసారిగా మండిపోవడం పరిస్థితి తీవ్రతను స్పష్టంగా చూపిస్తోంది. భూగర్భ జలాలు ఎంత ప్రమాదకరంగా కలుషితమయ్యాయో ఈ ఘటన ద్వారా బయటపడిందని నిపుణులు చెబుతున్నారు.
బాధితుల్లో ఒకరైన సదాశివ మాట్లాడుతూ.. తమ పరిస్థితి దారుణంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. మొదట బావి నీళ్లు తోడుకున్నప్పుడు తీవ్ర ఇంధన వాసన రావడంతో అనుమానం వచ్చిందని తెలిపారు. బావిని పలుమార్లు పూర్తిగా తోడి శుభ్రం చేసినప్పటికీ, భూమి అడుగు భాగం నుంచి మళ్లీ డీజిల్ పొరలా పైకి వస్తూనే ఉందని చెప్పారు. ప్రస్తుతం తాగడానికి నీరు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, కనీసం ఇంటి పనులకు కూడా బావి నీటిని ఉపయోగించలేని పరిస్థితి నెలకొందని తెలిపారు. దీంతో బయట నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకుని నిల్వ చేసుకుంటున్నామని చెప్పారు.
ఈ ఘటనకు సమీపంలో ఉన్న పెట్రోల్ బంక్ భూగర్భ ట్యాంకుల నుంచే డీజిల్ లీకై ఉండవచ్చని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బావులకు చాలా దగ్గరలోనే ఆ ఇంధన కేంద్రం ఉండటంతో అదే ప్రధాన కారణమని వారు ఆరోపిస్తున్నారు. అయితే పెట్రోల్ బంక్ యజమాని మాత్రం ఈ ఆరోపణలను పూర్తిగా ఖండించారు. తమ నిల్వల్లో ఎలాంటి తేడా లేదని, ట్యాంకుల్లో లీకేజీ సమస్య కూడా లేదని ఆయన స్పష్టం చేశారు. కానీ స్థానికులు మాత్రం ఈ వివరణను నమ్మడం లేదు.
ఇదిలా ఉండగా ఆరోగ్య శాఖ అధికారులు బావి నీరు తాగడానికి పూర్తిగా అనర్హమని ప్రకటించారు. అయినప్పటికీ కార్పొరేషన్ అధికారులు లేదా ప్రజాప్రతినిధులు ఇప్పటివరకు సంఘటనా స్థలాన్ని సందర్శించకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బావి నీటిలో ఇంధన లక్షణాలు ఉండటంతో ప్రమాదవశాత్తు మంటలు అంటుకుంటే భారీ అగ్నిప్రమాదం లేదా పేలుడు సంభవించే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
తక్షణమే జిల్లా యంత్రాంగం జోక్యం చేసుకుని లీకేజీకి అసలు కారణం ఏమిటో గుర్తించాలని, భూగర్భ జలాలు మరింత కలుషితం కాకుండా చర్యలు తీసుకోవాలని కావూర్ ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సరైన చర్యలు తీసుకోకపోతే ఇది భవిష్యత్తులో పెద్ద పర్యావరణ విపత్తుగా మారే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ALSO READ: బండి భగీరథ్ పై కఠిన సెక్షన్…! నేరం నిరూపితమైతే పదేళ్లు జైలు శిక్ష…