హైదరాబాద్, క్రైమ్మిర్రర్ః హైదరాబాద్నగరంలో గోషామహాల్ పోలీసు స్టేషన్ పరిధిలో పట్టపగలే దొంగలు భారీ చోరికి పాల్పడ్డారు. ఇంటిలో ఎవరు లేని సమయంలో చొరబడి పెద్ద ఎత్తున నగదు, వెండి, బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. ఇంటి యజమాని మహేశ్ ఆదివారం ఉదయం లంగర్ హౌస్లోని తన బంధువుల వివాహానికి కుటుంబసభ్యులతో వెళ్లారు. వారు వెళ్లడాన్ని గమనించిన దొంగలు ఇంటికి వేసిన తాళంను పగులకొట్టి ఇంట్లోకి చొరబడి బీరువాలో ఉన్న 30తులాల బంగారం, 30తులాల వెండి, రూ.5లక్షలు నగదును అపహరించినట్లు తెలుస్తుంది.
ఉదయం పెళ్లికి వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చిన యజమాని.. ఇంటి తాళం పగలగొట్టి ఉండటాన్ని గుర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగినట్లు గుర్తించిన యజమాని.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మహేశ్ ఫిర్యాదు మేరకు గోషామహల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనాస్థలిని పరిశీలించి, సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దొంగల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. పట్టపగలే దుండగులు ఇంట్లోకి చొరబడి దొంగతనానికి పాల్పడటం స్థానికంగా కలకలం రేపుతోంది.