క్రైమ్ మిర్రర్, తెలంగాణ సినిమా బ్యూరో: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం పెద్ది పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది. ఇది ఒక ఎమోషనల్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్న సినిమా. ఇప్పటికే విడుదలైన “చికిరి చికిరి”, “రా రా రే” పాటలు.. గ్లింప్సులు సినిమాపై అంచనాలను మరింత పెంచాయి.
మొదట ఈ సినిమాను ఏప్రిల్ 30న విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు జూన్ 4న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్ మీట్కు ప్రముఖ దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అలాగే దర్శకుడు బుచ్చిబాబు సనా, సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, నిర్మాత వెంకట సతీష్ కిలారు కూడా పాల్గొన్నారు.
దర్శకుడు బుచ్చిబాబు సనా మాట్లాడుతూ, ముందుగా ప్రకటించిన తేదీన సినిమా విడుదల చేయలేకపోయినందుకు ప్రేక్షకులకు క్షమాపణలు తెలిపారు. అయితే జూన్ 4న తప్పకుండా థియేటర్లలో చూసి సినిమాను ఆదరించాలని కోరారు. రామ్ చరణ్ టైమింగ్, కష్టపడే తత్వం ఈ సినిమాలో బాగా కనిపిస్తుందని చెప్పారు. ఈ సినిమా ప్రేక్షకుల హృదయాల్లో చాలా కాలం నిలిచిపోతుందని ఆయన అన్నారు.
నిర్మాత వెంకట సతీష్ కిలారు మాట్లాడుతూ, ఈ సినిమాతో తన ప్రస్థానం ప్రారంభమవడం గర్వంగా ఉందన్నారు. సినిమా ఫలితంపై తాను చాలా సంతోషంగా ఉన్నానని తెలిపారు. మొత్తం టీమ్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు.
దర్శకుడు సుకుమార్ మాట్లాడుతూ, ఈ కథను చాలా కాలం క్రితమే విన్నానని, ఇప్పుడు పెద్ద తెరపై చూడడం ఆనందంగా ఉందన్నారు. రామ్ చరణ్ నటన ఈ సినిమాను పాన్-ఇండియా స్థాయికి తీసుకెళ్తుందని చెప్పారు. ఈ చిత్రం భావోద్వేగాలతో నిండిన ప్రయాణమని, అందరూ థియేటర్లలో తప్పకుండా చూడాలని సూచించారు.
ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మొత్తానికి పెద్ది సినిమా ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని అందించే చిత్రంగా ఉండబోతోంది.