India Testing Cell Broadcast Alert System: కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అలర్ట్ జారీ చేసింది. ఈ వారం దేశ ప్రజలందరి మొబైల్ ఫోన్ కు ఒక్కసారిగా పెద్ద శబ్దంతో మెసేజ్ వస్తుందని వెల్లడించింది. ప్రజలు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదని ప్రకటించింది. ఎన్డీఎంఏ నిర్వహిస్తున్న ఒక పరీక్షలో భాగంగా ఆ అలర్ట్ మెసేజ్ వస్తుందని వెల్లడించింది. జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ (ఎన్డీఎంఏ) టెలికమ్యూనికేషన్స్ శాఖతో కలిసి సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్ అనే ప్రత్యేక విధానాన్ని పరీక్షిస్తోంది.
ఏంటీ వ్యవస్థ ప్రత్యేకత?
ఈ వ్యవస్థ ద్వారా భూకంపం, పిడుగు, సునామీ, అగ్నిప్రమాదం వంటి అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు, ఒక నిర్దిష్ట ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ ఒకేసారి వార్నింగ్ మెసేజ్ చేరేలా చేస్తారు. సాధారణంగా ఫోన్ కాల్స్, మెసేజ్లు ఎక్కువగా ఉండే సమయంలో నెట్వ ర్క్ బిజీ అవుతుంది. కానీ, ఈ కొత్త విధానంలో అలాంటి సమస్యలు ఉండవు. నెట్ వర్క్ ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ అలర్ట్ మెసేజ్లు త్వరగా అందుతాయి. ఈ పరీక్షల సమయంలో మీ ఫోన్ లో కనిపించే మెసేజ్ లు కేవలం అవగాహన కోసం మాత్రమే పంపుతారు. వాటిని చూసి భయపడాల్సిన పని లేదు. ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వడం, విపత్తుల సమయంలో ప్రాణ నష్టం తగ్గించడం లక్ష్యంగా ఈ వ్యవస్థను రూపొందించారు.
దేశీ టెక్నాజీతో రూపొందిన సెల్ బ్రాడ్కాస్ట్ అలర్ట్ సిస్టమ్
పూర్తి దేశీయంగా ఈ టెక్నాలజీ పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చేశారు. విజయవంతంగా పరీక్షలు పూర్తయిన తర్వాత దీనిని దేశ వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది. భవిష్యత్తులో ఎలాంటి విపత్తు వచ్చినా ప్రజలకు వెంటనే సమాచారం చేరేలా చేయడంలో ఈ వ్యవస్థ కీలక పాత్ర పోషించనుంది.