ఏపీలోని కడప జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. గోపవరం మండలం రామిరెడ్డి పల్లె ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు మల్లెం కొండయ్య ఆత్మహత్య చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
సోమవారం మధ్యాహ్నం పాఠశాల విధుల్లో ఉన్న సమయంలోనే, పాఠశాల సమీపంలో ఆయన పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నట్లు సమాచారం. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ఆయన ప్రాణాలు కోల్పోయారు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.
ఈ ఘటన వెనుక కుటుంబ సమస్యలే కారణమై ఉండొచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. అయితే అసలు కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ ఘటనతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
also read: హర్యానాలో దారుణం: స్కూల్ టీచర్పై కత్తితో దాడి చేసి హత్య చేసిన పూర్వ విద్యార్థి
