ఢిల్లీ, క్రైమ్ మిర్రర్: ఇరాన్ నైకన గల్ఫ్ ఆఫ్ ఒమన్లో అమెరికా స్వాధీనం చేసుకుంది. దీంతో ఒక్కసారిగా పశ్చిమాసియా ప్రాంతం భగ్గుమంటోంది. దీనికి ప్రతీకారంగా ఇరాన్ అమెరికా దళాలపై డ్రోన్లతో దాడులు చేసినట్లు వార్తలు సైతం వినిపిస్తున్నాయి.
హోర్ముజ్లో ఉద్రిక్తతలు తాజాగా పతాకస్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ జెండాతో ఉన్న వాణిజ్య నౌక తౌస్కాను అమెరికా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. నౌకపై తొలుత కాల్పులు జరిపి ఆపై అదుపులోకి తీసుకున్నాయి. గల్ఫ్ ఆఫ్ ఒమన్లో ఈ ఘటన జరిగింది. ఇరాన్ నౌకను స్వాధీనం చేసుకున్నామని యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఇరాన్ జెండా ఉన్న రవాణా నౌక తౌస్కా తమ దిగ్బంధనాన్ని దాటుకుని వెళ్లాలని అనుకుందని ట్రంప్ తెలిపారు. కానీ వారి ప్రయత్నం సఫలం కాలేదని అన్నారు. USS SPRUANCE అనే అమెరికన్ డెస్ట్రాయర్ నౌక తొలుత వారిపై హెచ్చరికగా కాల్పులు జరిపిందని తెలిపారు. అయితే, ఇరాన్ నావికులు దారికి రాకపోవడంతో నౌక ఇంజన్ రూమ్పై కాల్పులు జరిపి దాన్ని అడ్డుకున్నామని తెలిపారు. ఈ నౌకను సీజ్ చేసినట్టు అమెరికా సెంట్రల్ కమాండ్ మరో ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీని కూడా షేర్ చేసింది.
భగ్గుమన్న ఇరాన్…
ఈ పరిణామంపై ఇరాన్ భగ్గుమంది. ఇందుకు ప్రతీకారంగా అమెరికా నౌకలపై ఇరాన్ సైనిక దళం డ్రోన్స్ను ప్రయోగించిందని అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే, ఎన్ని డ్రోన్స్ను ప్రయోగించారనే విషయాన్ని చెప్పలేదు. ఈ దాడిలో యూఎస్ నౌకలు దెబ్బతిన్నాయా? లేదా? అనే వివరాలను కూడా వెల్లడించలేదు.