Elon Musk Slams WhatsApp: టెక్ దిగ్గజం ఎలాన్ మస్క్ మరోసారి వాట్సాప్పై విమర్శలు చేశారు. ఈ యాప్ను పూర్తిగా నమ్మలేమని ఆయన అభిప్రాయపడ్డారు. వినియోగదారుల డేటాను వాట్సాప్ గోప్యంగా బయట వ్యక్తులతో పంచుకుంటోందనే ఆరోపణల నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా, కొన్ని థర్డ్ పార్టీ కాంట్రాక్టర్లు యూజర్ల మెసేజీలను చూడగల అవకాశముందని వచ్చిన ఆరోపణలపై స్పందిస్తూ మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో, తన స్వంత మెసేజింగ్ ప్లాట్ఫామ్ ఎక్స్ చాట్ ను మెచ్చుకున్నారు. మెసేజింగ్, వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ కోసం ప్రజలు ఎక్స్ చాట్ను ఉపయోగించాలని సూచించారు. ఈ ప్లాట్ఫామ్ ద్వారా వినియోగదారులకు నిజమైన ప్రైవసీ లభిస్తుందని ఆయన అన్నారు.
టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ ఏమన్నారంటే?
ఇక ఈ అంశంపై టెలిగ్రామ్ సీఈఓ పావెల్ డురోవ్ కూడా స్పందించారు. వాట్సాప్ ఎన్క్రిప్షన్ వ్యవస్థపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. వినియోగదారులను తప్పుదారి పట్టించిన అతిపెద్ద మోసం ఇదేనని వ్యాఖ్యానించారు. వాట్సాప్పై తాజా కేసు కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కెనడా, దక్షిణాఫ్రికా, అమెరికా సహా పలు దేశాలు యూఎస్ ఫెడరల్ కోర్టులో ఈ విషయంపై క్లాస్ యాక్షన్ కేసు దాఖలు చేశాయి. ఈ కేసులో, వాట్సాప్ యూజర్ల మెసేజీలు పూర్తిగా సురక్షితంగా ఉంటాయని చెప్పి ప్రజలను తప్పుదారి పట్టించిందని ఆరోపించారు. అలాగే, కొన్ని సందర్భాల్లో వాట్సాప్ ఉద్యోగులు, ఇతర భాగస్వాములు ఈ మెసేజీలను చూసే అవకాశం ఉందన్నారు.
ఖండించిన మెటా సంస్థ
అయితే, ఈ ఆరోపణలను వాట్సాప్, దాని మాతృ సంస్థ మెటా ఖండించాయి. తమ ప్లాట్ఫామ్లో సిగ్నల్ ప్రోటోకాల్ ఆధారిత ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉపయోగిస్తున్నామని చెప్పాయి. పంపినవారు, రిసీవ్ చేసుకున్న వారు తప్ప మరెవ్వరూ మెసేజీలను చూడలేరని స్పష్టం చేశాయి. ప్రస్తుతం ఈ వివాదంపై తుది నిజాలు వెలుగులోకి రావాల్సి ఉంది.
