* పోటీ చేయడానికి నేతల విముఖత
* పార్టీ ఆవిర్భావం తర్వాత మూడుసార్లు ఓటమి
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: జగన్మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? విజయవాడ పార్లమెంట్ స్థానానికి కొత్త అభ్యర్థిని బరిలో దించునున్నారా? రాజమండ్రి కొడాలి నానితో పోటీ చేయిస్తారా? పొలిటికల్ వర్గాల్లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. కొడాలి నాని అయితే గట్టి అభ్యర్థి అవుతారని జగన్ స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
విజయవాడ పార్లమెంట్ స్థానం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి దక్కలేదు. ఆ పార్టీ ఆవిర్భవించి మూడుసార్లు ఎన్నికలు జరిగాయి. అభ్యర్థుల మార్పు తప్ప అక్కడ మంచి ఫలితం రావడం లేదు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా కోనేరు ప్రసాద్ పోటీ చేశారు. కానీ టిడిపి అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో సినీ నిర్మాత పొట్లూరు వరప్రసాద్ ను రంగంలోకి దించారు. ఆయన సైతం టిడిపి అభ్యర్థి కేశినేని నాని చేతిలో ఓడిపోయారు. అయితే ఈ రెండు ఎన్నికల్లో ఓడిపోయిన నేతలు ఇద్దరూ తర్వాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కనిపించడం మానేశారు. 2024 ఎన్నికల్లో సిట్టింగ్ ఎంపీగా ఉన్న కేశినేని నానిని వైసీపీలోకి రప్పించి టికెట్ ఇచ్చారు జగన్. కానీ ఆ ఎన్నికల్లో టిడిపి అభ్యర్థి కేసినేని చిన్ని చేతిలో ఓడిపోయారు నాని. ఇలా మూడుసార్లు ఆ పార్టీకి షాకింగ్ ఫలితాలు వచ్చాయి.
ఫైనల్ గా కొడాలి నాని..
ప్రస్తుతం విజయవాడ పార్లమెంట్ స్థానం నుంచి కొడాలి నాని పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఈ స్థానం నుంచి వైసీపీలో పోటీకి ఎవరు ముందుకు రావడం లేదు. పెద్దగా ఆసక్తి కనబరచడం లేదు. దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినిపించింది. కానీ ఆయన సైతం విజయవాడ తూర్పు అసెంబ్లీ నుంచి బరిలో దిగాలని చూస్తున్నారు. తనకు ఆసక్తి లేదని తేల్చేశారు. వల్లభనేని వంశీ మోహన్ పేరు తెరపైకి వచ్చింది. కానీ ఆయన సైతం విముఖత చూపారు. ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి మాజీమంత్రి కొడాలి నాని పై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని నానికి తెల్చి చెప్పినట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన కొడాలి నాని 2004, 2009లో ఆ పార్టీ తరఫున గుడివాడ నుంచి గెలిచారు. తరువాత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి 2014, 2019 ఎన్నికల్లో గెలిచారు. జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో మంత్రి కూడా అయ్యారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. చాలా రోజులపాటు అనారోగ్యానికి గురై నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడే యాక్టివ్ అవుతున్న తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఆయనకు విజయవాడ లోక్సభ పరిధిలో పోటీ చేయాల్సిందేనని తేల్చి చెప్పినట్లు సమాచారం. మరి కొడాలి నాని ఒప్పుకుంటారా? లేదా? అనేది చూడాలి.
