Amarnath Yatra Registration Process: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం అమర్ నాథ్ యాత్రకు వెళ్లాలనుకునే భక్తులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఈ యాత్రకు సంబంధించి ముందస్తు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన బ్యాంకుల 554 శాఖల్లో ఈ నమోదు చేపడతారని శ్రీ అమర్ నాథ్ పుణ్యక్షేత్ర బోర్డు వెల్లడించింది. యాత్రకు సంబంధించిన నియమాలు, మార్గదర్శకాలను కూడా బోర్డు విడుదల చేసింది.
‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ విధానం అమలు
ఈ రిజిస్ట్రేషన్ ‘ఫస్ట్ కమ్, ఫస్ట్ సర్వ్’ విధానంలో జరుగుతుంది. ప్రతి రోజు ప్రతి మార్గానికి ఒక నిర్దిష్ట కోటా ఉండటంతో, ముందుగా నమోదు చేసుకున్న వారికి మాత్రమే అవకాశం ఉంటుంది. అందువల్ల యాత్రకు వెళ్లాలని భావిస్తున్నవారు ఆలస్యం చేయకుండా ముందుగానే నమోదు చేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
యాత్రకు వెళ్లే వారికి వయస్సు పరిమితి కూడా విధించారు. 13 నుంచి 70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారికే అనుమతి ఉంటుంది. అలాగే ఆరు వారాల గర్భిణీలు ఈ యాత్రలో పాల్గొనడానికి అనుమతించరు. భక్తులు తప్పనిసరిగా ఆరోగ్య ధృవీకరణ పత్రం సమర్పించాలి. ఇది గుర్తింపు పొందిన వైద్యులు లేదా ఆసుపత్రుల నుంచి తీసుకోవాలి. ముఖ్యంగా ఈ సర్టిఫికేట్ ఏప్రిల్ 8 తర్వాత జారీ అయి ఉండాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ఈ-కేవైసీ విధానంలో జరుగుతుంది. దరఖాస్తు రుసుమును రూ.150గా నిర్ణయించారు. భక్తులు తమ వివరాలను సమర్పించి, అవసరమైన పత్రాలను అందజేస్తే నమోదు పూర్తవుతుంది.
జులై 3న అమర్ నాథ్ యాత్ర ప్రారంభం
ఈ ఏడాది అమర్నాథ్ యాత్ర జూలై 3న ప్రారంభమవుతుంది. యాత్ర ప్రారంభానికి వారం రోజుల ముందు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ముగిస్తారు. అందువల్ల యాత్రకు సిద్ధమవుతున్న భక్తులు ముందుగానే నమోదు పూర్తి చేసుకుని, మార్గదర్శకాలను పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
