చెన్నై, క్రైమ్ మిర్రర్: టీవీకే అధ్యక్షుడు, తమిళ సినిస్టార్ విజయ్ తన రాజకీయ ప్రయాణంలో సామాన్యులకే పీఠం అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. ఇందులో భాగంగానే ఎన్నికల కోసం ఆయన ఎక్కువగా అభిమానులకు, సామన్య కార్యకర్తలకు టిక్కెట్లు కేటాయించారు. ఆచరణలో మాత్రం ఈ నిర్ణయం పునుసవాల్గా మారుతోంది. అయితే దిగ్గజపార్టీలైన డీఎంకే, ఏఐఏడీఎం వంటి పార్టీల ఒత్తిడికి తలొగ్గి ఒక్కొక్కరుగా తప్పుకుంటున్నారు. దీంతో పార్టీకి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి.
విజయ్ పార్టీకి చెందిన అభ్యర్థుల్ని బరి నుంచి తప్పించేందుకు డీఎంకే, అన్నాడీఎంకే కూటములు గట్టి ప్రయత్నాలు చేస్తున్నాయి. నామినేషన్ల సమయం ముగియడంతో తమ ప్లాన్ అమలు చేస్తున్నారు. తాజాగా ఎడప్పాడి నుంచి టీవీకే అభ్యర్థి వైదొలిగారు. అలాగే సుమారు 20కి పైగా స్థానాల్లో అభ్యర్థులు బరి నుండి తప్పించే ప్రణాళికల్ని అమలు చేస్తున్నారు. ప్రత్యర్థి పార్టీల వ్యూహాలను తట్టుకోలేకనో లేదా ఎన్నికల ఖర్చును భరించలేకనో వారు వెనకడుగు వేస్తుండటం విజయ్ను ఆందోళనకు గురిచేస్తోంది.
ఒకవేళ నామినేషన్ల పర్వం ముగిశాక అభ్యర్థులు సైలెంట్ అయిపోయినా లేదా పోటీ నుండి తప్పుకున్నా, అది కొత్తగా పుట్టిన టీవీకే పార్టీ పరువును బజారున పడేస్తుందని ఆ పార్టీ అంతర్గత వర్గాలు భయపడుతున్నాయి.విజయ్ పార్టీ ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య బలమైన అభ్యర్థుల కొరత . క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల పేరున్న నేతలు లేకపోవడం పార్టీకి మైనస్గా మారుతోంది. అభ్యర్థులు ఉపసంహరించుకుంటే ఆ ప్రభావం విజయ్ భవిష్యత్తు రాజకీయాలపై తీవ్రంగా పడుతుంది.
ఈ క్రమంలోనే విజయ్ తన కోర్ టీమ్తో అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నారని, అభ్యర్థులకు అవసరమైన ఆర్థిక, నైతిక మద్దతును ఎలా అందించాలనే దానిపై కసరత్తు చేస్తున్నారని సమాచారం. వెండితెరపై వందల కోట్లు కొల్లగొట్టిన దళపతికి, రాజకీయ క్షేత్రంలో అభ్యర్థుల ఎంపికే మొదటి పెద్ద అడ్డంకిగా మారింది. ఏదేమైనా ఈ గండాన్ని విజయ్ ఎలా అధిగమిస్తారనే దానిపైనే తమిళగ వెట్రి కళగం భవిష్యత్తు ఆధారపడి ఉందని పలువురు పేర్కొంటున్నారు.
