Homeజాతీయందేశవ్యాప్తంగా డీజిల్ ధర భారీగా పెంపు!

దేశవ్యాప్తంగా డీజిల్ ధర భారీగా పెంపు!

అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరుగుతున్న నేపథ్యంలో భారతదేశంలో పారిశ్రామిక ఇంధన ధరలు గణనీయంగా పెరిగాయి. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు ఐఓసీఎల్, బీపీసీఎల్ వంటి కంపెనీలు ఏప్రిల్ 1న పారిశ్రామిక డీజిల్ ధరలను భారీగా పెంచినట్లు సమాచారం. మీడియా నివేదికల ప్రకారం.. పారిశ్రామిక డీజిల్ లీటరుకు రూ.28.22 పెరగడంతో ధర రూ.109.59 నుంచి రూ.137.81కు చేరింది. ఈ పెరుగుదల దాదాపు 25 శాతం వరకు ఉండటం గమనార్హం. గతంలో మార్చి 20న కూడా ధరలను రూ.22 మేర పెంచడంతో రాజధానిలో పారిశ్రామిక డీజిల్ ధర రూ.87.67 నుంచి రూ.109.59కు పెరిగింది. దీంతో తక్కువ సమయంలోనే రెండు దఫాలుగా భారీ ధరల పెరుగుదల పరిశ్రమలపై భారం పెంచుతోంది.

పారిశ్రామిక డీజిల్ అంటే హెచ్‌ఎస్‌డీని పెద్ద స్థాయిలో వాణిజ్య అవసరాల కోసం విక్రయిస్తారు. ముఖ్యంగా జనరేటర్లను నడపాల్సిన పెద్ద కర్మాగారాలు, తయారీ యూనిట్లు దీనిని విస్తృతంగా వినియోగిస్తాయి. నిర్మాణ రంగంలో భారీ యంత్రాలను నడపడానికి, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో కూడా ఈ ఇంధనం కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ప్రైవేట్ బస్సు నిర్వాహకులు, పెద్ద రవాణా సంస్థలు కూడా బల్క్‌గా డీజిల్ కొనుగోలు చేస్తుంటారు. ఈ ధరల పెరుగుదలతో వారి నిర్వహణ ఖర్చులు గణనీయంగా పెరిగే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

ఇక ఫర్నెస్ ఆయిల్ ధరలు కూడా పెరగడం పరిశ్రమలకు మరో దెబ్బగా మారింది. లీటరుకు రూ.23.77 పెరగడంతో ఈ ఇంధనం వినియోగించే రంగాలపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఇది డీజిల్ కంటే కొద్దిగా చిక్కగా ఉండే ఇంధన రూపం. ఉక్కు, సిమెంట్ వంటి భారీ పరిశ్రమల్లో కొలిమిలను నడపడానికి, విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తికి, ఫ్యాక్టరీ బాయిలర్లలో ఆవిరి తయారీకి విస్తృతంగా ఉపయోగిస్తారు. అలాగే పెద్ద ఓడల ఇంజిన్లలో కూడా ఈ ఇంధనం వినియోగిస్తారు. ధరలు పెరగడంతో ఈ రంగాల్లో ఉత్పత్తి వ్యయాలు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

మరోవైపు సాధారణ వినియోగదారులకు కొంత ఊరటనిచ్చే విషయం ఏమిటంటే.. పెట్రోల్ పంపుల వద్ద రిటైల్ ధరలు ప్రస్తుతం మార్పు లేకుండా కొనసాగుతున్నాయి. సాధారణ ప్రజలు కొనుగోలు చేసే పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి పెరుగుదల నమోదు కాలేదు. అయితే నయారా ఎనర్జీ, షెల్ వంటి ప్రైవేట్ రిటైలర్లు తమ నష్టాలను పూడ్చుకునేందుకు లీటరుకు రూ.3 నుంచి రూ.25 వరకు ధరలను పెంచినట్లు సమాచారం. మొత్తంగా చూస్తే పారిశ్రామిక రంగానికి ఇంధన ధరల పెరుగుదల మరింత భారం మోపే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ALSO READ: పెళ్లి వీడ్కోలులో పెంపుడు కుక్కల భావోద్వేగ క్షణాలు (VIDEO)

Shiva Krishna
Shiva Krishnahttp://www.crimemirror.com
శివకృష్ణ క్రైమ్ మిర్రర్ వెబ్‌సైట్‌లో డిజిటల్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు. క్రైమ్, రాజకీయాలు, సామాజిక అంశాలు మరియు ప్రజలకు సంబంధించిన తాజా పరిణామాలపై వార్తలు, విశ్లేషణాత్మక కథనాలు రాస్తున్నారు. వార్తలను ప్రచురించే ముందు విశ్వసనీయ వనరులు, అధికారిక ప్రకటనలు మరియు అందుబాటులో ఉన్న డేటాను పరిశీలించి నిజ నిర్ధారణ (Fact-Checking) చేయడంపై ప్రత్యేక దృష్టి పెడతారు. డిజిటల్ మీడియా ప్రమాణాలను అనుసరించి స్పష్టమైన, నిజమైన మరియు సమగ్ర సమాచారాన్ని పాఠకులకు అందించడం ఆయన లక్ష్యం. వైరల్ సోషల్ మీడియా పోస్టులు, బ్రేకింగ్ న్యూస్ మరియు ప్రాంతీయ అంశాలపై పరిశీలన చేసి పాఠకులకు విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నారు. క్రైమ్ మిర్రర్లో ప్రచురితమయ్యే వార్తలు జర్నలిస్టిక్ నైతిక ప్రమాణాలు, ఖచ్చితత్వం (Accuracy), పారదర్శకత (Transparency) మరియు బాధ్యత (Accountability) సూత్రాలను పాటిస్తూ సిద్ధం చేయబడతాయి. పాఠకులకు సరైన సమాచారం చేరేలా శివకృష్ణ నిరంతరం కృషి చేస్తున్నారు.

తాజావార్తలు