War Impact On Beer Production: అమెరికా–ఇరాన్ మధ్య యుద్ధం కారణంగా మన దేశంలోని అనేక రంగాలపై స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికే వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు బీర్ల కొరత కూడా తలెత్తే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా వేసవికాలంలో బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉండే సమయంలో ఈ పరిస్థితి రావడం ఆందోళన కలిగిస్తోంది.
నేచురల్ గ్యాస్ కొరతతో..
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా నేచురల్ గ్యాస్ సరఫరా తగ్గిపోయింది. బీరు సీసాలు తయారు చేసే గ్లాస్ ఫ్యాక్టరీలు ఎక్కువగా గ్యాస్పై ఆధారపడుతాయి. గ్యాస్ కొరత కారణంగా ఈ కంపెనీలు ఉత్పత్తిని తగ్గించటం లేదా తాత్కాలికంగా నిలిపివేయటం చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్కు చెందిన ఒక గ్లాస్ కంపెనీ సుమారు 40 శాతం వరకు ఉత్పత్తిని తగ్గించిందని తెలిపింది. అదే సమయంలో శీతల పానీయాలు, జ్యూసులు, కెచ్ప్ వంటి ఉత్పత్తుల ప్యాకేజింగ్ సీసాల తయారీ కూడా తగ్గింది.
భారీగా పెరిగిన బీర్ల తయారీ వ్యయం
అటు ఉత్పత్తి వ్యయం పెరగడంతో సీసాల ధరలు 17–18 శాతం వరకు పెరిగాయి. మరోవైపు, బీరును నిల్వ చేయడానికి ఉపయోగించే అల్యూమినియం క్యాన్ల తయారీలో కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అల్యూమినియం దిగుమతులు తగ్గడంతో వాటి సరఫరా ప్రభావితం అవుతోంది.
ధరలు పెంచక తప్పదా?
మన దేశంలోని బీర్ మార్కెట్లో ప్రధానంగా హైనెకెన్, ఏబీ ఇన్ బేవ్, కార్ల్స్ బర్గ్ గ్రూప్ సంస్థలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ధరలు పెంచకుండా ఉత్పత్తి కొనసాగించడం కష్టమని ఇవి సూచిస్తున్నాయి. పరిశ్రమ వర్గాల ప్రకారం బీర్ల ధరలు 12–15 శాతం వరకు పెరిగే అవకాశం ఉంది. ఈ ప్రభావం కేవలం బీర్లకే పరిమితం కాకుండా ప్యాకేజ్డ్ నీటి రంగంపైనా పడింది. ప్లాస్టిక్ బాటిల్స్, వాటి మూతల ధరలు పెరగడంతో నీళ్ల బాటిల్స్ ధరలు కూడా సుమారు 11 శాతం పెరిగాయి.
