PM Modi Calls Key Meeting with CMs: పశ్చిమాసియా ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో, రాష్ట్రాల సన్నద్ధతపై సమీక్షకు సంబంధించి ప్రధాని నరేంద్ర మోడీ ఇవాళ ముఖ్యమంత్రులతో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ప్రతి రాష్ట్రం తీసుకుంటున్న చర్యలు, అత్యవసర ప్రణాళికలు, పరస్పర సహకారం వంటి అంశాలపై చర్చించనున్నారు.
ఇరాన్ యుద్ధం నేపథ్యంలో సమావేశం
ఫిబ్రవరి 28న ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా కలిసి చేసిన దాడుల తర్వాత, సీఎంలతో ప్రధాని సమావేశం నిర్వహించడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ పరిణామాల ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నందున, భారత్ కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఎన్నికలు జరిగే రాష్ట్రాల సీఎంలకు మినహాయింపు!
ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ సమావేశంలో పాల్గొనలేరు. ఆ రాష్ట్రాల తరఫున చీఫ్ సెక్రటరీలు కేంద్ర క్యాబినెట్ సెక్రటరీతో సమావేశమై, ప్రధాని సమావేశంలో చర్చించబోయే అంశాలను తెలుసుకుంటారు. తద్వారా ఆ రాష్ట్రాలు కూడా కేంద్రంతో సమన్వయం చేసుకునే అవకాశం ఉంటుంది.
కోవిడ్ తరహా పరిస్థితులను ఎదుర్కోవాలంటూ..
కోవిడ్ సమయంలో దేశం మొత్తం కలిసి ఎలా పనిచేసిందో, అదే విధంగా ప్రస్తుత పరిస్థితులను కూడా ఐక్యంగా ఎదుర్కోవాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఏవైనా అత్యవసర పరిస్థితులు ఎదురైతే రాష్ట్రాలు సిద్ధంగా ఉండేలా ముందస్తు చర్యలు తీసుకోవడం ఈ సమావేశం ముఖ్య లక్ష్యంగా భావిస్తున్నారు. దేశ భద్రత, ప్రజల రక్షణ దృష్ట్యా కేంద్రం–రాష్ట్రాల మధ్య సమన్వయం మరింత బలపడేందుకు ఈ సమావేశం కీలకంగా మారనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
