మూడు నగరాలను కైవసం చేసుకోవాలని నిర్ణయం
వచ్చే నెలలో ప్రధాని మోదీ పర్యటన
గట్టి వ్యూహంతో బిజెపి
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ పై బిజెపి దృష్టి పెట్టిందా? బల్దియా ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తోందా? మూడు నగరాలను కైవసం చేసుకోవాలని భావిస్తోందా? అందులో భాగమే ప్రధాని మోదీ పర్యటన? తెలంగాణ పొలిటికల్ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది. భాగ్యనగరం అంటే నిజంగా భాగ్యనగరమే. తెలంగాణ రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది భాగ్యనగరం. అటువంటి నగరంలో పట్టు సాధించడం ద్వారా 2028 అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తోంది భారతీయ జనతా పార్టీ. అందుకే బల్దియా ఎన్నికల్లో కాషాయాన్ని విస్తరించి.. తెలంగాణ మొత్తాన్ని ఆవహించాలని గట్టి ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.
మొన్న తిరువనంతపురంలో..
కేరళ రాష్ట్ర రాజధాని తిరువనంతపురం. ఇటీవల ఆ నగరంలో సత్తా చాటింది భారతీయ జనతా పార్టీ. కనీసం కేరళలో బిజెపికి ప్రాతినిధ్యం లేదు. అక్కడ పార్టీ ఉనికి చాటుకునేందుకు ఇబ్బంది పడుతుంది. కానీ ఆ రాష్ట్రంలో బాగా వేయాలంటే రాజధాని లో ప్రతాపం చూపాలని చూసింది. అలా తిరువనంతపురం నగరాన్ని కైవసం చేసుకుంది కమలం పార్టీ. ఇప్పుడు అదే వ్యూహంతో ముందుకు సాగుతోంది. గ్రేటర్ హైదరాబాద్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. అయితే గ్రేటర్ హైదరాబాద్ 400 డివిజన్లతో విస్తరించి ఉంది. దీనిని 3 నగరాలుగా విభజించింది కాంగ్రెస్ ప్రభుత్వం. అయితే ఈ 400 డివిజన్లకు గాను 300 డివిజన్లను వచ్చే ఎన్నికల్లో గెలుపొందాలని బిజెపి గట్టి ప్రణాళిక వేసుకుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ వచ్చే నెలలో గ్రేటర్ లో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు.
పెరిగిన బలం
గ్రేటర్ పరిధిలో భారతీయ జనతా పార్టీ గట్టిగానే ఉంది. గడిచిన బల్దియా ఎన్నికల్లో 40 డివిజన్లను ఆ పార్టీ గెలుచుకుంది. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అయితే 8 సీట్లు సొంతం చేసుకుంది. అయితే ఈసారి గ్రేటర్ ఎన్నికల్లో సత్తా చాటడం ద్వారా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం కావాలని భావిస్తోంది. 2028 అసెంబ్లీ ఎన్నికలకు ఒక ఊపు తేవాలంటే బల్దియా ఎన్నికల్లో బలమైన మార్గం ఏర్పాటు చేసుకోవాలని చూస్తోంది. గతంలో కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ పరిధిలో బలహీనంగా ఉండేది. కానీ ఇటీవల ఉప ఎన్నికల్లో వరుసగా విజయాలు సొంతం చేసుకుంటూ తన సత్తా చాటుతోంది. ఇంకోవైపు గులాబీ పార్టీ ఇంకా చిక్కుల్లోనే ఉంది. రోజురోజుకు ఆ పార్టీ బలహీనం అవుతోంది. గులాబీ పార్టీ నేతలను ఆకర్షించే పనిలో పడింది భారతీయ జనతా పార్టీ. ఎట్టి పరిస్థితుల్లో వచ్చే బల్దియా ఎన్నికల్లో ఎక్కువ స్థానాలను కైవసం చేసుకోవాలని చూస్తోంది.
నేరుగా రంగంలోకి ప్రధాని..
మొన్న ఆ మధ్యన ప్రధాని నరేంద్ర మోడీ బిజెపి ఎంపీలను పిలిచి తెలంగాణలో పార్టీ పరిస్థితి గురించి తెలుసుకున్న సంగతి తెలిసిందే. అందరూ కలిసికట్టుగా ఉండి పార్టీని మరింత పటిష్టంగా ముందుకు తీసుకెళ్లాలని కోరినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు నేరుగా ప్రధాని రంగంలో దిగబోతున్నారు. తెలంగాణను బిజెపి ఏ స్థాయిలో ప్రాధాన్యం ఇస్తుందో ఇట్టే అర్థమవుతుంది. మరి బిజెపి ఎలాంటి విజయాలను నమోదు చేస్తుందో చూడాలి.
