తెలంగాణ రాష్ట్రంలో విద్యా రంగాన్ని పూర్తిగా పునర్నిర్మించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకోబోతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెల్లడించారు. జాతీయ స్థాయిలో అమలవుతున్న +2 విధానాన్ని పరిశీలించిన తర్వాత రాష్ట్రంలో కూడా విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలని యోచిస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఇకపై పదోతరగతి పరీక్షల విధానం పూర్తిగా మారే అవకాశాలు ఉన్నాయని, ప్రస్తుత SSC బోర్డు వ్యవస్థ కొనసాగకపోవచ్చని సంకేతాలు ఇచ్చారు. ఈ విషయంపై అధ్యయనం జరుగుతోందని, విద్యా కమిషన్ నివేదిక మాత్రమే తుది నిర్ణయం కాదని పేర్కొన్నారు. మార్పులు అమలు చేయడానికి ముందు విస్తృతంగా చర్చలు, పరిశీలనలు జరుగుతాయని తెలిపారు.
బడ్జెట్పై మాట్లాడిన ముఖ్యమంత్రి.. ఇది సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చిన బడ్జెట్ అని పేర్కొన్నారు. అసెంబ్లీలో బడ్జెట్కు వ్యతిరేకంగా ప్రవర్తించిన బీఆర్ఎస్ నేతలపై ఆయన విమర్శలు గుప్పించారు. చెవిలో పువ్వులు పెట్టుకుని బయటకు రావడం కాకుండా ప్రజల సమస్యలపై చర్చించాల్సిందిగా వ్యాఖ్యానించారు. రాష్ట్ర రాజకీయాల్లో ఎవరు నిజమైన నాయకుడో ప్రజలే నిర్ణయిస్తారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ అంశంపై స్పందిస్తూ.. పూర్తి స్థాయి విచారణ పూర్తయ్యే వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేమని స్పష్టం చేశారు. అవసరమైతే తాను కూడా విచారణకు హాజరవడానికి సిద్ధమని చెప్పారు. ఆరు హామీల అమలుకు ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకెళ్తోందని వివరించారు. భూముల అమ్మకాల విషయంలో ప్రభుత్వం వ్యతిరేకం కాదని, కానీ ప్రజా సంపదను వ్యక్తిగత ప్రయోజనాల కోసం వినియోగించడం మాత్రం అనుమతించబోదని పేర్కొన్నారు.
మూసీ నది అభివృద్ధి విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని, బాధితుల అభిప్రాయాలను తీసుకుని ముందుకు వెళ్తామని తెలిపారు. కేంద్రంతో సంబంధాలపై స్పందిస్తూ, ఢిల్లీ పర్యటనలపై విమర్శలు చేసే వారు రాష్ట్రానికి తెచ్చిన నిధుల గురించి కూడా మాట్లాడాలని సూచించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావు చేస్తున్న వ్యాఖ్యలు వాస్తవానికి దూరమని, కోర్టు క్లిన్ చిట్ అంశాన్ని తప్పుగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వ కాలంలో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ అయ్యాయని ఆరోపించారు.
డ్రగ్స్ సమస్యపై కూడా ఆయన స్పందిస్తూ.. ఈ అంశంపై ప్రతిపక్షాల స్పందన అవసరమని అన్నారు. ఎమ్మెల్యేల అభిప్రాయం ప్రకారమే ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారని, తనకు మద్దతు తెలిపిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు.
ALSO READ: Houseplant Vastu: ఏ మొక్క ఎలాంటి సంకేతం ఇస్తుందో తెలుసా?
