వివిధ పథకాల అనుసంధానంతో కుటుంబ సాధికారితే లక్ష్యం
అమరావతి,క్రైమ్ మిర్రర్: రాష్ట్రంలో పేదరికాన్ని సంపూర్ణంగా రూపుమాపి, పేదల జీవన ప్రమాణాలను పెంపొందించడమే లక్ష్యంగా జీరో పావర్టీ మిషన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతిలో సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ విభాగాలతో జీరో పావర్టీ మిషన్ కుటుంబ సాధికారితపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.
సమీకృత వ్యూహంతో రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకు కార్యాచరణ చేపట్టాలని సీఎం సూచించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో మహిళా స్వయం సహాయ సంఘాల సంస్థలు సెర్ప్, మెప్మా, ఆర్టీజీఎస్ వ్యవస్థలను సమన్వయం చేస్తూ జీరో పావర్టీ మిషన్ ను ముందుకు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఎస్ హెచ్ జీలకు సంబంధించి ఈ వ్యవస్థల నెట్వర్క్ ద్వారా 1.3 కోట్ల కుటుంబాల ఆదాయం పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ అంశంపై వివిధ దేశాలు రాష్ట్రాల్లో అమలు అవుతున్న అత్యుత్తమ పేదరిక నిర్మూలన విధానాలను అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. 2047 స్వర్ణాంధ్ర మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో జీరో పావర్టీ మిషన్ సమర్ధంగా చేపట్టాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో పేదరిక నిర్మూలన మిషన్ కు సంబంధించి కేంద్రం అమలు చేస్తున్న నేషనల్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా వచ్చే ఆర్ధిక సంవత్సరంలో రూ.1100 కోట్లును సమర్ధంగా వినియోగించుకునేలా కార్యాచరణ చేపట్టాలన్నారు.
అటు జాతీయ అర్బన్ లైవ్లీ హుడ్ మిషన్ ద్వారా పట్టణ ప్రాంతాల్లోనూ పేదరిక నిర్మూలన కోసం ప్రణాళికలు చేయాలన్నారు. వీటితో పాటు స్వయం సహాయ సంఘాలు తయారు చేసే ఉత్పత్తులకు స్వయం పేరిట బ్రాండింగ్ ఇచ్చి మార్కెటింగ్ సౌకర్యం కల్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.
