మంచిర్యాల, క్రైమ్ మిర్రర్: క్యాతనపల్లి లో ఇటీవల బిఆర్ఎస్ నాయకులు జరిపిన దాడిలో గాయపడిన మందమర్రికి చెందిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్త జావిద్ ఖాన్ను రాష్ట్ర కార్మిక, మైనింగ్ శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.
ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, ధైర్యం చెప్పారు. ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఏటీసీ సెంటర్ ఏర్పాటు...
బీఆర్ ఎస్ నాయకుల దాడిలో గాయపడ్డ కాంగ్రెస్ కార్యకర్తను పరామర్శించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి డాక్టర్. జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల కోసం ఏటీసీ సెంటర్లలో హార్టీకల్చరల్, అగ్రికల్చరల్ కోర్సులను ప్రవేశపెట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు.
ఈ సెంటర్లలో చదివే ప్రతి విద్యార్థికి రూ.2,000 స్కాలర్షిప్ అందిస్తామని చెప్పారు. చెన్నూరు నియోజకవర్గంలో ఇప్పటికే 3,500 ఇందిరమ్మ ఇండ్లను అర్హులైన పేదలకు మంజూరు చేశామని, రాబోయే ఏప్రిల్ నెలలో మరో 2,000 ఇండ్లను మంజూరు చేస్తామని స్పష్టం చేశారు.
ఇంటింటికి తాగునీరు అందించేందుకు అమృత్ పథకం కింద రూ.100 కోట్లతో పనులు జరుగుతున్నాయని, ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి ఉన్న ప్రాంతాల్లో తక్షణ చర్యలు తీసుకుని ప్రజలకు నీరు అందించాలని సూచించినట్లు చెప్పారు.ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
