అమెరికా వాణిజ్య మంత్రి ఆకస్మిక రాక
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో చర్చలు
అమెరికాలోని తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశంతో కుదుర్చుకునే వాణిజ్య ఒప్పందంలో కూడా మార్పులు చేసుకోవాలని భారత్ భావిస్తోంది. దేశ ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. మారిన పరిస్థితుల దృష్ట్యా అవసరమైతే వాణిజ్య ఒప్పందాన్ని రీ బ్యాలెన్స్ చేస్తామని వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. టారిఫ్ లపై అమెరికా నుంచి వస్తున్న సంకేతాలను గమనించి, ప్రయోజనాలను కాపాడుకునేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు.
ఆకస్మికంగా భారత్ కు వచ్చిన అమెరికా వాణిజ్య మంత్రి
అటు అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ ఎలాంటి ముందస్తు ఏర్పాట్లు లేకుండా, అనూహ్యంగా ఢిల్లీకి వచ్చారు. ఆ తర్వాత మంత్రి గోయల్ తో చర్చలు జరిపారు. రెండు దేశాల మధ్య కుదరాల్సిన వాణిజ్య ఒప్పందంలో మార్పుల కోసమే ఆయన వచ్చారన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. టారిఫ్ ల విధింపుపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు ఉన్న విస్తృత అధికారాలను అక్కడి సుప్రీంకోర్టు కొట్టివేయడం, అమెరికా-భారత్ ఒప్పందంపై చర్చలు కీలకదశకు చేరుకున్న నేపథ్యంలో లుట్నిక్ భారత్ కు రావడం ఆసక్తి కలిగిస్తుంది. చర్చలు ఫలవంతమయ్యాయని గోయల్ తో పాటు భారత్ లో అమెరికా రాయబారి సెర్గిక్ గోర్ వెల్లడించారు.
