రూ.2 కోట్ల ఇన్సూరెన్స్ కోసం ఓ మహిళ తన ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన ఘటన కర్ణాటకలో సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితురాలు సుమతో పాటు మొత్తం తొమ్మిది మందిని పోలీసులు అరెస్టు చేశారు.
చంపేసి, రోడ్డు ప్రమాదంగా నమ్మించే ప్రయత్నం
మృతుడు మాజీ సైనికుడు సందీప్ కలగౌడ మంజరగి (46). అతడి మరణం మొదట రోడ్డు ప్రమాదం కారణంగా జరిగిందని అందరూ భావించారు. అయితే, దర్యాప్తులో అసలు విషయం బయటపడటంతో పోలీసులు షాక్కు గురయ్యారు. బెళగావి జిల్లా యమకనమరడి పోలీసులు ఈ ఘటనపై లోతుగా విచారణ జరిపారు. సందీప్ భార్య సుమకు పుండలీక్ డొంబర్ అనే వ్యక్తితో సన్నిహిత సంబంధం ఉన్నట్లు తెలిసింది. భర్త పేరుపై ఉన్న రూ.2 కోట్ల బీమా మొత్తాన్ని పొందాలనే ఉద్దేశంతో ఇద్దరూ కలిసి హత్యకు పథకం రచించారు.
సెలైన్ ద్వారా విషం ఎక్కించి హత్య!
మార్చి 13న జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన సందీప్ను హుక్కేరి ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతున్న సమయంలో సెలైన్ బాటిల్ ద్వారా విషం ఎక్కించి మార్చి 15న అతడిని హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం ప్రమాదంలో గాయాల కారణంగానే మరణించాడని కుటుంబ సభ్యులు, బంధువులను నమ్మించి అంత్యక్రియలు నిర్వహించారు. అయితే, సందీప్ సోదరుడికి అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు ప్రారంభించిన అధికారులు మొదట సుమ, పుండలీక్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో మరిన్ని వివరాలు వెలుగులోకి రావడంతో మరో ఏడుగురి పాత్ర కూడా బయటపడింది.
మొత్తం 9 మంది నిందితుల అరెస్ట్
ఈ కేసులో ఆర్ఎంపీ వైద్యుడు, ప్రభుత్వ ఉద్యోగి, ఫోరెన్సిక్ ల్యాబ్కు చెందిన సిబ్బంది సహా పలువురు నిందితులుగా గుర్తించబడ్డారు. నకిలీ వైద్య నివేదికలు తయారు చేయడం, నేరాన్ని దాచిపెట్టేందుకు సహకరించడం వంటి ఆరోపణలు వారిపై ఉన్నాయి. ప్రస్తుతం ఈ కేసులో అరెస్టైన తొమ్మిది మందిపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బీమా డబ్బుల కోసం భర్త హత్యకు కుట్ర పన్నిన ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది.