HomeజాతీయంKerala Assembly: కేరళ అసెంబ్లీలో వందేమాతరం వివాదం.. గవర్నర్ తీవ్ర ఆగ్రహం!

Kerala Assembly: కేరళ అసెంబ్లీలో వందేమాతరం వివాదం.. గవర్నర్ తీవ్ర ఆగ్రహం!

కేరళ అసెంబ్లీలో వందేమాతరం వివాదం నెలకొన్నది. అసెంబ్లీ తొలి సమావేశాల సందర్భంగా వందేమాతరంలోని పూర్తి గేయాన్ని వినిపించకుండా కొన్ని చరణాలకే పరిమితం కావడంపై గవర్నర్‌ రాజేంద్ర విశ్వనాథ్‌ అర్లేకర్‌ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటీవల కేంద్ర హోంశాఖ అధికారిక కార్యక్రమాల్లో వందేమాతరం గేయాన్ని పూర్తిస్థాయిలో వినిపించాలని సూచిస్తూ మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ విషయాన్ని ముందుగానే గవర్నర్‌ కార్యాలయం రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసినట్లు సమాచారం. అయినప్పటికీ, అసెంబ్లీ ప్రారంభ కార్యక్రమంలో పూర్తి గేయాన్ని ప్రసారం చేయకపోవడంతో వివాదం చెలరేగింది.

గవర్నర్ తీవ్ర అభ్యంతరం

సంప్రదాయం ప్రకారం కొత్త అసెంబ్లీ సమావేశాలను గవర్నర్‌ ప్రసంగంతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పోలీస్‌ బ్యాండ్‌ వందేమాతరంలోని ఆరు చరణాలను మాత్రమే సంగీత రూపంలో వినిపించింది. మిగిలిన భాగాన్ని గానం చేయకుండా కేవలం వాద్య సంగీతాన్ని మాత్రమే ప్రదర్శించింది. దీనిపై గవర్నర్‌ కార్యాలయ వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం సూచించిన విధంగా పూర్తి గేయాన్ని వినిపించాల్సి ఉండగా, ఆ నిబంధనలను పాటించలేదని లోక్‌భవన్‌ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ అంశం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రతిపక్షాలు కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి.

నిర్ణయాన్ని సమర్థించుకున్న రాష్ట్ర ప్రభుత్వం

అయితే, రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని సమర్థించుకుంది. ముఖ్యమంత్రి సతీశన్‌ మాట్లాడుతూ, అసెంబ్లీలో అనుసరించిన విధానం రాష్ట్రంలో చాలా కాలంగా అమలులో ఉన్న సంప్రదాయానికి అనుగుణంగానే ఉందని తెలిపారు. ఇందులో ఎలాంటి ఉద్దేశపూర్వక తప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. దీంతో వందేమాతరం గేయం పూర్తిగా వినిపించాలా? లేక ఇప్పటివరకు కొనసాగుతున్న విధానమే సరిపోతుందా? అనే అంశంపై చర్చ మొదలైంది. కేంద్ర మార్గదర్శకాలు, రాష్ట్ర సంప్రదాయాల మధ్య ఏర్పడిన ఈ భేదాభిప్రాయం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదంపై మరింత చర్చ జరిగే అవకాశం కనిపిస్తోంది.

Anjibabu Ch
Anjibabu Chhttps://crimemirror.com/
గత 15 సంవత్సరాలుగా మీడియా రంగంలో ఉన్నారు. పలు ప్రముఖ మీడియా సంస్థల్లో పని చేశారు. ప్రస్తుతం ‘క్రైమ్ మిర్రర్’కు డిప్యూటీ ఎడిటర్ ఇన్ చీఫ్ గా విధులు నిర్వహిస్తున్నారు. రాజకీయాల నుంచి సినిమాల వరకు.. నేషనల్ నుంచి ఇంటర్నేషనల్ వరకు.. స్పోర్ట్స్ నుంచి క్రైమ్ వరకు అన్ని రకాల కథనాలు అందిస్తున్నారు.

తాజావార్తలు