క్రైమ్ మిర్రర్ : పాకిస్థాన్కు చెందిన ప్రముఖ టిక్టాకర్, యూట్యూబర్ షమ్సో బీబీ దారుణ హత్యకు గురయ్యారు. 28 ఏళ్ల షమ్సో బీబీకి టిక్టాక్లో 13 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆగస్టు 14న టాక్సిలా నగరంలో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. పోలీసుల వివరాల ప్రకారం.. షమ్సో బీబీ తన సోదరుడు, సోదరితో కలిసి కారులో వెళ్తుండగా ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ద్విచక్ర వాహనంపై వచ్చి కారును అడ్డగించారు. అనంతరం తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో షమ్సో బీబీ మెడలోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఆమె సోదరి అసీమా తీవ్రంగా గాయపడ్డారు.
మృతురాలి తండ్రి ఫజల్ సాహిబ్జాదా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం.. కాశిఫ్ అనే వ్యక్తి షమ్సోకు ఫోన్ చేసి ఇంటి నుంచి బయటకు రావాలని కోరాడు. దీంతో ఆమె తన చెల్లి, తమ్ముడితో కలిసి కారులో బయలుదేరారు. కొద్దిసేపటికే దుండగులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రధాన నిందితులు పరారీలో ఉండగా, వారికి షమ్సో బీబీ కదలికలపై సమాచారం అందించినట్లు అనుమానిస్తున్న ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రావల్పిండి పోలీసులు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
షమ్సో బీబీ సోషల్ మీడియా కార్యకలాపాలు హత్యకు కారణం కాదని, ఆర్థిక వివాదమే ప్రధాన కారణమై ఉండొచ్చని ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. కౌసర్, జావేద్ అలియాస్ షాహీన్తో షమ్సోకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ఆమె తండ్రి పోలీసులకు తెలిపారు. ఇదిలా ఉండగా, 2026 మార్చిలో టిక్టాక్ క్రియేటర్ సనా జావేద్ కూడా ఇస్లామాబాద్లో హత్యకు గురైనట్లు సమాచారం. వరుసగా సోషల్ మీడియా క్రియేటర్ల హత్యలు చోటుచేసుకోవడం పాకిస్థాన్లో చర్చనీయాంశంగా మారింది.
also read : భారీగా పెరిగిన పసిడి ధరలు…! ఈ రోజు ఎంతంటే…
