విజయవాడ, క్రైమ్మిర్రర్: ఆంధ్రప్రదేశ్లో పాలన పూర్తిగా గాడి తప్పిందన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ అన్నారు. చంద్రబాబు క్రిమినల్ బ్రెయిన్తో వైసీపీ నేతలే టార్గెట్గా రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయన యాక్టీవ్గా ఉండరని, అందుకే నీతిమాలిన రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు ఆఖరి పాలన సమయంలోనైనా ప్రజలకు మంచి చేయాలని జగన్ సూచించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీ ప్రకారం పెట్రోల్ ధరలు తగ్గించాలని లీటర్పై 8 రూపాయల వరకు తగ్గించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ను జంగిల్ రాజ్గా మార్చేసి చంద్రబాబు పాలన సాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. రెండేళ్లలో ప్రజలకు మంచి చేయకపోగా ప్రశ్నించి వారిపై కేసులతో కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని అన్నారు. రాష్ట్రంలో విచ్చల విడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందన్నారు.
తనకు ప్రతికూలంగా ఏదైనా విషయం వస్తే దాన్ని డైవర్ట్ చేయడానికి మరో రాజకీయ అలజడి రేపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తున్న తప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతుందని ఎద్దేవా చేశారు. అమరావతి అయితే జీరో నుంచి మొదలు పెట్టాలని అందుకే తాము మావిగన్ అనే ప్రతిపాదన తీసుకొచ్చామన్నారు జగన్. ఆ పదం వింటేనే చంద్రబాబుకు గుండె ఆగిపోయేలా ఉందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా చంద్రబాబు చేస్తున్నారని అన్నారు. అలాంటి వ్యక్తి సీఎంగా ఉండటం రాష్ట్రం చేస్కున్న దురదృష్టమని ఆరోపించారు. ఆచరణ సాధ్యం కాని అమరావతి వల్ల భవిష్యత్లో కూడా ఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారని అన్నారు.
ఇప్పటికే అమరావతి కోసం 47 వేల కోట్లు అప్పులు చేశారని, రాష్ట్ర ఖజానా నుంచి 9 వేల కోట్లు ఖర్చు చేయబోతున్నారని తెలిపారు. అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా మళ్లీ పర్మినెంట్ బిల్డింగ్స్ అంటూ కొత్త నాటకానికి తెర తీశారని అన్నారు. కేవలం ఐదు బిల్డింగ్ల కోసం చేస్తున్న ఖర్చు చూసి జనం నివ్వెరపోతున్నారని ఎద్దేవా చేశారు. ఆ ఐదు బిల్డింగ్స్ కోసం చదరపు అడుగు కోసం 20, 427 రూపాయలు ఖర్చు చేస్తున్నారని పాత లెక్క ప్రకారం ఇది ఐదు వేలే అన్నారు. తెలంగాణ నిర్మించిన సచివాలయానికి కూడా అంత ఖర్చు కాలేదని, ప్రపంచంలోని ఏ కట్టడాలకు ఇంత ఖర్చు చేయడం లేదని చెప్పారు.
ఇది కేవలం నిర్మాణ ఖర్చు మాత్రమేనని ఇంకా ఫర్నీచర్, ఇంటీరియర్ లెక్కలు వేసుకుంటే అది 30 వేలు దాటిపోతుందని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. జాతీయ రహదారి నిర్మాణానికి కిలోమీటర్కు 24 కోట్లు ఖర్చు అవుతుందని కేంద్రం చెప్పిందని చంద్రబాబు మాత్రం అమరావతిలో రోడ్లకు కిలోమీటర్కు 53 కోట్లు ఖర్చు చేస్తున్నారని జగన్ తెలిపారు. బిల్డింగ్స్, రోడ్ల విషయంలోనే కాకుండా ప్లాట్ల కేటాయింపులో కూడా స్కామ్ జరుగుతోందని ఆరోపించారు. సామాన్యులకు చెరువుల్లో, కుంటల్లో, ప్లాట్లు కేటాయిస్తూ సన్నిహితులకు మాత్రం రోడ్లు పక్కనే భూములు ఇప్పించారని ఆరోపించారు.
ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అన్న వ్యక్తి తర్వాత వాటిని అమలు చేయకుండా మోసం చేశారని జగన్ ఆరోపించారు. పంటలకు గిట్టుబాటు ధర లేదన్నారు. ఇన్పుట్ సబ్సిడీ కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామనని చెప్పి అధికారంలోకి వచ్చి ఇప్పుడు వాటిని పెంచేశారని మండిపడ్డారు. కోవిడ్ టైంలో కూడా తాము రూపాయి మాత్రమే పెంచామని తర్వాత పెంచలేదని గుర్తు చేశారు. ఇంధన సంక్షోభంలో కూడా చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఉన్న లెక్క ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ లీటర్కు 8 రూపాయలు తగ్గించాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలు…
చంద్రబాబువే హత్యా రాజకీయాలు అని ఆరోపించిన జగన్ చెడ్డోడినైతే తాతను చంపిన వాళ్లు ప్రశాంతంగా ఉండేవాళ్లా అని జగన్ ప్రశ్నించారు. జగన్ నైజానికి ఇదే నిదర్శమని అన్నారు. చంద్రబాబులా తన తండ్రి హత్యా రాజకీయాలు నేర్పించలేదని అన్నారు. చంద్రబాబుకు ఇవే చివరి ఎన్నికలని అన్నారు. వచ్చే ఎన్నికల నాటికి ఆయనకు 80 ఏళ్లు వస్తాయని చెప్పారు. ఈ వయసులోనూ ఇలాంటి దౌర్భాగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే తాను మాత్రం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నామన అందుకు గర్వంగా ఉందన్నారు.