రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. 2026-27 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు సంబంధించి 14 ప్రధాన పంటల కనీస మద్దతు ధరలను పెంచేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రైతులకు పెట్టుబడిపై కనీసం 50 శాతం లాభం వచ్చేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
వరికి క్వింటాల్ పై రూ. 72 పెంపు
ఈ నిర్ణయంతో వారి మద్దతు ధర క్వింటాల్కు రూ.72 పెరిగింది. సాధారణ రకం వారి ఎమ్మెస్పీ ఇప్పుడు రూ.2,441కు చేరగా, ఏ గ్రేడ్ వరి ధర రూ.2,461గా నిర్ణయించారు. అన్ని పంటల్లో అత్యధిక పెంపు పొద్దుతిరుగుడు గింజలకు లభించింది. క్వింటాల్కు రూ.622 పెంచి కొత్త ధరను రూ.8,343గా నిర్ణయించారు.
కీలక విషయాలు వెల్లడించిన అశ్విని వైష్ణవ్
2014 నుంచి 2026 వరకు వ్యవసాయ రంగంలో పెద్ద మార్పులు వచ్చాయని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు, వారికి చెల్లించే మొత్తాలు కూడా పెరిగాయని చెప్పారు. 2004 నుంచి 2014 మధ్య వరి రైతులకు రూ.4.44 లక్షల కోట్లు చెల్లించగా, 2014-26 మధ్య ఈ మొత్తం రూ.16.08 లక్షల కోట్లకు పెరిగిందని వివరించారు.
రైతులకు మరింత లాభం పెరిగే అవకాశం
ఎమ్మెస్పీ ధరల వల్ల పెసర సాగు రైతులకు అత్యధికంగా 61 శాతం లాభం వచ్చే అవకాశం ఉందని కేంద్రం ప్రకటించింది. మొక్కజొన్న, సజ్జ రైతులకు 56 శాతం, కంది రైతులకు 54 శాతం వరకు లాభం చేకూరుతుంది. రైతులను నూనెగింజలు, పప్పుధాన్యాల సాగు వైపు ప్రోత్సహించేందుకు ఆ పంటల మద్దతు ధరలను కూడా పెంచినట్లు మంత్రి వైష్ణవ్ తెలిపారు. ఇక మినుములు, వేరుశనగ, సోయాబీన్, నువ్వులు, అవిసెలు, పత్తి వంటి పంటల ఎమ్మెస్పీలను కూడా కేంద్రం పెంచింది. ఈ నిర్ణయం రైతులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు చెబుతున్నారు.