*మే 13, 14న టీజీ ఐసెట్ పరీక్షలు..
*టీజీ ఐసెట్ 2026కు భారీ ఏర్పాట్లు
*69 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
*ఐసెట్ రాయనున్న 56 వేల మందికి పైగా అభ్యర్థులు
*ఎంజీయూలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు
*ఐసెట్ పరీక్షలపై ప్రత్యేక నిఘా
క్రైమ్ మిర్రర్, నల్లగొండ బ్యూరో: మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తున్న తెలంగాణ ఐసెట్- 2026 పరీక్షలను సజావుగా జరిపేలా అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పరీక్షలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా జరిగేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఎంజీయూలో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి అన్ని కేంద్రాల్లో ఏర్పాట్లను పరిశీలించారు. బుధవారం(మే 13న) ఉదయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నుంచి ప్రశ్నాపత్రాలను భద్రత మధ్య పంపిణీ చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వివరించారు.
మే 13, 14 తేదీల్లో పరీక్షలు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సులలో అడ్మిషన్ కోసం నిర్వహించే ఐసెట్ 2026ను రెండవ పర్యాయం మహాత్మా గాంధీ విశ్వవిద్యాలయం నిర్వహిస్తోంది. మే 13, 14వ తారీకుల్లో మూడు విడతల్లో నిర్వహించనున్న టీజీ ఐసెట్ కు 56,223 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 30,308 మంది మహిళలు, 25,915 మంది పురుషులు ఉన్నారు. మే 13న మొదటి స్పెషల్ ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, రెండవ స్పెషన్ మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:00 వరకు, 14 మే మొదటి సెషన్ ఉదయం 10 నుండి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించనున్నారు. దివ్యాంగులు మరియు ఉర్దూ విద్యార్థులకు మే 13 మధ్యాహ్నం 2వ సెషన్ లోపరీక్ష నిర్వహించనున్నారు. వారికి అవసరమైన ప్రత్యేక సదుపాయాలు కూడా కల్పించినట్లు చెప్పారు.
69 కేంద్రాలలో పరీక్షల నిర్వహణ
టీజీ ఐసెట్ పరీక్షలను రాష్ట్రవ్యాప్తంగా 16 రీజినల్ కేంద్రాల పరిధిలోని 69 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పరీక్షల నిర్వహణ కోసం సుమారు 100 మంది పరిశీలకులను నియమించారు. ప్రతి కేంద్రంలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు సమయానికి ముందే చేరుకోవాలని సూచించారు. మొదటి సెషన్కు హాజరయ్యే విద్యార్థులను ఉదయం 8:30 గంటల నుంచే కేంద్రాల్లోకి అనుమతిస్తారు. రెండో సెషన్ విద్యార్థులను మధ్యాహ్నం 1:30 గంటల నుంచి అనుమతిస్తారు. మొదటి సెషన్ విద్యార్థులను ఉదయం 9:45 తర్వాత, రెండో సెషన్ విద్యార్థులను మధ్యాహ్నం 1:45 తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు ఆలస్యం కాకుండా ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.
పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు చోటుచేసుకోకుండా అన్ని చర్యలు తీసుకున్నామని, విద్యార్థులు ఎలాంటి టెన్షన్ లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయాలని ఐసెట్ కన్వీనర్ ఆచార్య అల్వాల రవి సూచించారు.