క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డికి అమెరికాలో నిర్వహించనున్న తెలుగు సభలకు ఆహ్వానం అందింది. అమెరికాలో నిర్వహించనున్న 19వ అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహా సభలకు వైసీపీ అధినేత జగన్ను ఆటా ప్రతినిధులు తాజాగా ఆహ్వానించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్రకార్యాలయంలో జగన్ను కలిసి ఆటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, మాజీ ప్రెసిడెంట్ భువనేష్ బుజల, ఆటా కాన్ఫరెన్స్ నేషనల్ కో-ఆర్డినేటర్ శరత్ వేముల, ట్రెజరర్ శ్రీకాంత్ గుడిపాటి, జయ సింహారెడ్డి చల్లా తదితర ప్రతినిధులు జగన్ను కలిసి ఆహానాన్ని అందించారు. ఆటా సభలు జూలై 31 నుంచి ఆగస్టు రెండో తేదీ మధ్య అమెరికాలోని మేరిల్యాండ్ రాష్ట్రం, బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించనున్నారు. ఈ ఏడాది నిర్వహిస్తున్న సభలు 19వ ఆటా మహా సభలు. ఈ మహా సభలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తాజాగా ఆటా ప్రతినిధులు జగన్కు అందించా రావాలని కోరారు.
సేవలను ప్రశంసించిన జగన్..
ఆటా ప్రతినిధులతో సుదీర్ఘంగా మాట్లాడిన జగన్.. వారు చేస్తున్న సేవలను కొనియాడారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువస్తూ, తెలుగు భాషా సంసృతుల పరిరక్షణ, అభివృద్ధికి ఆటా చేస్తున్న సేవలను ప్రశంసనీయమని పేర్కొన్నారు. ఆటా సభ్యులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలను తెలియజేయడంతోపాటు మహా సభలను విజయవంతంగా నిర్వహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా తనను కలిసిన నేతల యోగ, క్షేమాలను, అక్కడ చేస్తున్న ఉద్యోగ, వ్యాపారాల విషయాలను అడిగి తెలుసుకున్నారు. తెలుగు ప్రజల అభివృద్ధికి కృషి చేయడంతోపాటు కలిసికట్టుగా ఉండాలని ఈ సందర్భంగ్ జగన్ వారికి సూచించారు. ఇకపోతే, ఆటా మహా సభలను ఏటా నిర్వహిస్తూ వస్తున్నారు. అమెరికాతోపాటు ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి పెద్ద సంఖ్యలో తెలుగు ప్రజలు ఈ వేడుకల్లో పాల్గొంటారు. తెలుగు వారి ఐక్యతను, సాంస్కృతిక వైభవాన్ని మరింతగా చాటిచెప్పే ఉద్ధేశంతో ఏటా ఆటా సభలను నిర్వహిస్తుంటామని ప్రతినిధులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆటా ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాల వివరాలను జగన్కు వివరించారు.