సూర్యాపేట జిల్లాలో కలకలం రేపిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మద్యం, మత్తు పదార్థాలకు బానిసై డబ్బుల కోసం నిత్యం వేధిస్తున్న కొడుకును ఓ తల్లి హత్య చేసిన ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
ఈ ఘటన సూర్యాపేటలో ఈ నెల 12వ తేదీ రాత్రి చోటుచేసుకుంది. భూక్యా అచ్చి అనే మహిళ తన కుమారుడు విజయ్ ప్రవర్తనతో తీవ్రంగా విసిగిపోయినట్లు పోలీసులు తెలిపారు. మత్తు అలవాట్ల కోసం తరచూ డబ్బులు కావాలని వేధించడంతో ఆవేశంలో ఆమె గొడ్డలితో దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది.
దాడిలో తీవ్రంగా గాయపడిన విజయ్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. అయితే తొలుత గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేశారని కుటుంబ సభ్యులు భావించారు. చికిత్స పొందుతూ విజయ్ మృతి చెందడంతో ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. విజయ్ సోదరి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. విచారణలో తల్లి అచ్చి పాత్ర బయటపడటంతో ఆమెను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసులు మరింత దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
also read: ప్రేమ పేరుతో మోసం.. పెళ్లికి నిరాకరించడంతో నర్సు ఆత్మహత్య