ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం పాతమాగులూరు గ్రామంలో గురువారం తెల్లవారుజామున తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సజ్జల పిచ్చిరెడ్డి (47) దారుణ హత్యకు గురయ్యారు.
పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారనే అనుమానంతో వెంకటేశ్వరమ్మ (43) కుమారుడు విష్ణు (25) ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. వెంకటేశ్వరమ్మ ఇంట్లో ఉన్న పిచ్చిరెడ్డిపై విష్ణు ఇనుప రాడ్డుతో దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన పిచ్చిరెడ్డి సమీపంలోని ఇసుక కుప్పలో పడిపోయి అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. ఘటన అనంతరం విష్ణు, వెంకటేశ్వరమ్మ ఇద్దరూ అద్దంకి పోలీస్ స్టేషన్కు వెళ్లి పోలీసుల ఎదుట లొంగిపోయారు.
సమాచారం అందుకున్న సంతమాగులూరు సీఐ శేషగిరిరావు పోలీసు సిబ్బందితో కలిసి ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం నరసరావుపేట ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. హత్యకు దారితీసిన అసలు కారణాలు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలపై దర్యాప్తు కొనసాగిస్తున్నారు. పాతమాగులూరు గ్రామంలో ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.
also read: మంగళగిరి ఎయిమ్స్లో కోవిడ్ అలర్ట్.. ప్రత్యేక ఫీవర్ వార్డు ఏర్పాటు