కర్ణాటకలోని తుమకూరు జిల్లా జాతీయ రహదారి- 48పై భారీ పేలుడు సంభవించింది. బెంగళూరులో నివసిస్తున్న రమ్యా ఉల్లాస్ అనే యువతి, తనతో ఆరేళ్లుగా సంబంధంలో ఉన్న నాగేంద్రతో ప్రయాణిస్తున్న సమయంలో ఈ ప్రమాదకర సంఘటన జరిగింది.
సంజయ్ గాంధీ హాస్పిటల్లో ఓటీ టెక్నీషియన్గా పనిచేస్తున్న రమ్య, ఇటీవల వ్యక్తిగత విభేదాల కారణంగా నాగేంద్రతో దూరంగా ఉంటోంది. ఇదే క్రమంలో శనివారం ఉదయం నాగేంద్ర ఆమె గదికి వెళ్లి గొడవకు దిగాడు. అనంతరం ఆమెను బలవంతంగా కారులో తీసుకెళ్లినట్లు సమాచారం.
ప్రయాణ సమయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం తీవ్రమైంది. ఆ సమయంలో నాగేంద్ర కత్తితో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అలాగే తనతో తీసుకువచ్చిన పేలుడు పదార్థాన్ని చూపిస్తూ పెళ్లి చేసుకోవాలని లేదా కలిసి చనిపోవాలని ఒత్తిడి చేసినట్లు పోలీసులు చెబుతున్నారు.
అప్రమత్తమైన రమ్య వెంటనే డ్రైవర్కు విషయం తెలిపి, పరిస్థితి ప్రమాదకరంగా ఉందని గ్రహించి కారులో నుంచి బయటకు దూకింది. డ్రైవర్ కూడా వెంటనే వాహనాన్ని ఆపి దిగి సురక్షితంగా బయటపడ్డాడు. క్షణాల్లోనే కారు భారీగా పేలిపోయింది.
ఈ పేలుడులో నాగేంద్ర కారులోనే ఉండిపోయినట్లు, అతను తెచ్చుకున్న పేలుడు పదార్థం కారణంగా మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రేమ విభేదాలే ఈ దారుణ ఘటనకు కారణమా లేదా మరేదైనా కోణం ఉందా అన్నది విచారణలో వెల్లడవుతుంది.
also read: 3 నెలల బిడ్డతో మీటింగ్కు వచ్చిన మంత్రి… వైరల్!