నల్గోండ, క్రైమ్మిర్రర్: గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఒక చిన్న సర్టిఫికేట్ కోసమో, పాస్పోర్ట్ దరఖాస్తు కోసమో పట్టణాల్లోని మీసేవ కేంద్రాల చుట్టూ తిరిగే రోజులకు త్వరలోనే తెరపడనుంది. గ్రామాల పరిధిలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలనే ఇకపై మల్టీ సర్వీస్ డిజిటల్ హబ్లుగా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ డిజిటల్ భారత్ చొరవతో, నాబార్డు సమన్వయంతో రూపుదిద్దుకుంటున్న ఈ సరికొత్త కామన్ సర్వీస్ సెంటర్ల (సీఎస్సీ) ద్వారా.. ఆధార్, పాన్ కార్డు సేవలతో పాటు వందలాది ప్రభుత్వ, ప్రైవేటు సేవలను రైతుల వద్దకే తెస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలు చిన్న డిజిటల్ పని కోసమైనా, ప్రభుత్వ సేవలను పొందాలన్నా మండల కేంద్రాలకో లేదా పట్టణాలకో పరుగులు తీసే రోజులు త్వరలోనే కానరాకుండా పోనున్నాయి.
ఇకపై మీ గ్రామంలో ఉండే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ద్వారానే సమస్త డిజిటల్ పౌర సేవలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. రాష్ట్ర సహకార శాఖ ఆధ్వర్యంలో ఈ సంఘాలన్నింటినీ కామన్ సర్వీస్ సెంటర్లుగా (సీఎస్సీ) మార్చే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది.సాధారణంగా ప్రాథమిక సహకార సంఘాలు అంటే కేవలం రైతులకు రుణాలు ఇవ్వడం, ఎరువులు, విత్తనాలు పంపిణీ చేయడానికే పరిమితం అనే భావన ఉంది. అయితే వీటికి పూర్తిస్థాయిలో డిజిటల్ హంగులు అద్ది, డిజిటల్ భారత్ పథకంలో భాగంగా గ్రామీణులకు అవసరమైన అన్ని రకాల సామాజిక, సంక్షేమ, విద్యా, ఆరోగ్య సేవలను ఒకే చోట అందించాలని కేంద్రం నిర్ణయించింది. ఇందులో భాగంగానే కేంద్ర సహకార శాఖ, ఐటీ మంత్రిత్వ శాఖ, నాబార్డుల మధ్య జాతీయ స్థాయిలో కీలక అవగాహన ఒప్పందం కుదిరింది.
Also Read:“ముంబై ఖర్చులు భరించలేను…” – వరవరరావు విజ్ఞప్తిపై హైకోర్టు కీలక నిర్ణయం?
ఈ సరికొత్త డిజిటల్ విప్లవం ద్వారా పీఏసీఎస్లు కేవలం వ్యవసాయ కేంద్రాలుగానే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో సరికొత్త ఉపాధి అవకాశాలను సృష్టించే డిజిటల్ హబ్లుగా రూపాంతరం చెందనున్నాయి.తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 908 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. వీటిని ఈ ఏడాది ఆఖరు నాటికి వంద శాతం కామన్ సర్వీస్ సెంటర్లుగా మార్చాలనేది ప్రభుత్వ లక్ష్యం. అయితే తొలి విడతగా రాబోయే ఆగస్టు 15వ తేదీ నాటికి 562 సంఘాల్లో సేవలను ప్రారంభించేందుకు ఐటీ శాఖ మద్దతుతో లైసెన్సులు, ఆన్లైన్ అనుసంధాన ప్రక్రియను పూర్తి చేశారు. ఇప్పటికే 15 కేంద్రాల్లో ప్రయోగాత్మకంగా కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. అలాగే డిజిటల్ సేవలతో పాటుగా ప్రభుత్వ, వ్యాపార విభాగాలు కూడా ఇక్కడే కొలువుదీరనున్నాయి.అయితే ఈ కామన్ సర్వీస్ సెంటర్లలో ఆధార్ కార్డు అప్డేట్, పాన్ కార్డు, పాస్పోర్ట్ దరఖాస్తులు, ఓటరు గుర్తింపు కార్డులు, జనన మరణాల నమోదు చేసుకోవచ్చు.
Also Read:New Diesel Rules: డీజిల్పై కేంద్రం కొత్త ఆంక్షలు.. ఇక రోజుకు ఎన్ని లీటర్లు పోస్తారంటే?
అంతేకాకుండా ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన, భూసార పరీక్ష కార్డులు, డెయిరీ, మత్స్య పరిశ్రమ సేవలు, రేషన్, గోదాముల నిర్వహణ వంటి సేవలను కూడా అందిస్తారు. అలాగే జీవన్ ప్రమాణ్ పత్రాలు, శ్రమయోగి మాన్ధన్ పెన్షన్లు, స్కాలర్షిప్లు, ఐటీ రిటర్నుల దాఖలు, జీవిత బీమా, విద్యుత్, నీటి బిల్లుల చెల్లింపులు, వాహన్, ఈ చలాన్, ఈ స్టాంపుల జారీ, బస్సు, రైలు, విమాన టికెట్ల బుకింగ్ సదుపాయం కూడా ఇక్కడ లభిస్తుంది.వీటన్నింటితో పాటు భవిష్యత్తులో ఈ సహకార సంఘాలను జన ఔషధి కేంద్రాలుగా మార్చి.. రాయితీ ధరలపై నాణ్యమైన ఔషధాలను విక్రయించడానికి కూడా ప్రత్యేక లైసెన్సులు మంజూరు చేయనున్నారు. ఈ చొరవతో గ్రామీణ ప్రజల సమయం, డబ్బు భారీగా ఆదా కానున్నాయి.