నీట్ యూజీ పేపర్ లీకేజీ కేసు దర్యాప్తును సీబీఐ వేగవంతం చేసింది. ఈ కేసులో భాగంగా దేశంలోని పలు రాష్ట్రాల్లో పలు సోదాలు నిర్వహించిన సీబీఐ, ఐదుగురిని అరెస్టు చేసింది. అరెస్టయిన వారిలో దినేశ్ బివాల్, మంగీలాల్ బివాల్, వికాస్ బివాల్, యశ్ యాదవ్, శుభం ఖైర్నర్ ఉన్నారు. వీరిలో దినేశ్ బివాల్ స్థానికంగా బీజేపీ కార్యకర్తగా ఉండటంతో ఈ వ్యవహారం రాజకీయంగా చర్చకు దారితీసింది.
సికార్కు చెందిన ఓ విద్యార్థి నుంచి పేపర్ లీక్
దర్యాప్తులో భాగంగా పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్కు చెందిన ఓ విద్యార్థి నుంచి పేపర్ లీక్ వ్యవహారం ప్రారంభమైనట్లు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం అతను కేరళలో ఎంబీబీఎస్ చదువుతున్నట్లు సమాచారం. అతను ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసి తనతో పంచుకున్నట్లు, తర్వాత సికార్లోని ఓ హాస్టల్ యజమానికి కూడా పంపినట్లు అధికారులు తెలిపారు. ఆ హాస్టల్ యజమాని విద్యార్థి తండ్రేనని మొదట ప్రచారం జరిగినప్పటికీ, అది నిజం కాదని తర్వాత తేలింది. ఆసక్తికర విషయం, పేపర్ లీకేజీపై మొదట పోలీసులకు సమాచారం కూడా ఇచ్చింది అదే హాస్టల్ యజమాని అని అధికారులు.
ఈ కేసులో కీలక వ్యక్తిగా నాసిక్కు చెందిన శుభం ఖైర్నర్ను సీబీఐ అదుపులోకి తీసుకుని విచారణ కోసం ఢిల్లీకి తరలించింది. ప్రశ్నపత్రం నాసిక్ నుంచే బయటకు వచ్చిన అవకాశాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. ఇంకా పలువురిని ప్రశ్నిస్తున్నామని, మరికొందరిని అరెస్టు చేసే అవకాశం కూడా ఉందని సీబీఐ అధికారులు తెలిపారు.
NTA అధికారులను ప్రశ్నించిన సీబీఐ
అటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కార్యాలయానికి కూడా సీబీఐ బృందం వెళ్లి పరీక్షల నిర్వహణలో పాల్గొన్న అధికారులను ప్రశ్నించారు. మరోవైపు, దినేశ్ బివాల్ అరెస్టు నేపథ్యంలో రాజకీయ విమర్శలు కూడా పెరిగాయి. అశోక్ గెహ్లాట్ బీజేపీ ప్రభుత్వం ఈ కేసును తొక్కిపెట్టే ప్రయత్నం చేసిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.