కృష్ణా, క్రైమ్ మిర్రర్: కృష్ణా జిల్లా పామర్రు మండలం గాంధీనగర్లో సోమవారం తెల్లవారు జామున భర్త చేతిలో భార్య హత్యకు గురైన ఆ ప్రాంతంలో కలకలం రేపింది. తన భార్య మరొకరితో సహజీవనం చేస్తుందని భర్త అనుమానం పెంచుకున్నాడు. ఈ క్రమంలో భార్యపై కోపంతో.. భర్త తన సోదరులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు.
వివరాలు…
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు దిమ్మెట లక్ష్మీప్రసన్న (30). ఆమెకు 13 ఏళ్ల క్రితం మీర్జాపురం గ్రామానికి చెందిన మురళీకృష్ణతో వివాహం జరిగింది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే, కొంతకాలంగా కుటుంబంలో ఏర్పడిన మనస్పర్థల కారణంగా లక్ష్మీప్రసన్న తన భర్త, పిల్లలను వదిలిపెట్టి నిడుమోలు గ్రామానికి చెందిన అయ్యప్ప అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. లక్ష్మి ప్రసన్న వివాహేతర సంబంధం పెట్టుకొని దూరంగా ఉండటాన్ని జీర్ణించుకోలేని భర్త తన ఇద్దరి సోదరులతో కలిసి దాడికి పాల్పడ్డాడు. ఇనుప రాడ్డుతో తలపై బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై అక్కడికక్కడే మృతి చెంది.
సమాచారం అందుకున్న వెంటనే పామర్రు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ హత్యకు సహకరించిన భర్త మురళీకృష్ణతో పాటు అతని ఇద్దరు సోదరులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వివాహేతర సంబంధం వల్ల ఏర్పడిన కక్షలే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు నిర్ధారించారు. 13 ఏళ్ల వైవాహిక బంధం, ఇద్దరు పిల్లలు ఉన్నప్పటికీ, వివాహేతర సంబంధాలు చివరకు ఇలాంటి విషాదాంతాలకు దారితీస్తున్నాయని పోలీసులు తెలిపారు.