డిజిటల్ చెల్లింపులను మరింత వేగవంతంగా, వినియోగదారులకు సౌకర్యవంతంగా మార్చే దిశగా రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఆటోమేటిక్ ఇ-మాండేట్ లావాదేవీలకు సంబంధించి కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకువచ్చింది. ఈ మార్పులతో ఇకపై వినియోగదారులు కొత్త కార్డు తీసుకున్నప్పుడు పాత కార్డుపై ఉన్న ఇ-మాండేట్ చెల్లింపులు ఆటోమేటిక్గా కొత్త కార్డుకు బదిలీ అవుతాయి. దీంతో సబ్స్క్రిప్షన్లు లేదా బిల్లుల చెల్లింపులు మధ్యలో ఆగిపోకుండా నిరంతరంగా కొనసాగుతాయి. డిజిటల్ లావాదేవీలను సులభతరం చేయడంతో పాటు భద్రతా ప్రమాణాలను మెరుగుపరచడమే ఈ నిర్ణయాల వెనుక ప్రధాన ఉద్దేశ్యంగా పేర్కొంది.
ఈ మార్పులపై ఆర్బీఐ ప్రత్యేక ప్రకటన జారీ చేస్తూ, కంపెనీలు మరియు వినియోగదారుల నుంచి వచ్చిన సూచనలను పరిగణనలోకి తీసుకుని ఈ నిబంధనలను సవరించినట్లు తెలిపింది. ఆటోమేటిక్ చెల్లింపుల సందర్భంగా వినియోగదారులకు పంపే నోటిఫికేషన్లలో ఫిర్యాదులను ఎలా నమోదు చేయాలి అనే పూర్తి వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని బ్యాంకులకు సూచించింది. దీనివల్ల వినియోగదారులు ఎదుర్కొనే సమస్యలకు తక్షణ పరిష్కారం లభించే అవకాశాలు పెరుగుతాయి.
ముఖ్యంగా నెలకు రూ.15,000 వరకు జరిగే ఆటోమేటిక్ చెల్లింపులకు ఇకపై ఓటీపీ లేదా పాస్ వర్డ్ అవసరం ఉండదని ఆర్బీఐ స్పష్టం చేసింది. అయితే ఈ పరిమితిని మించిన లావాదేవీలకు మాత్రం భద్రతా ధృవీకరణగా ఓటీపీ లేదా పాస్ వర్డ్ తప్పనిసరిగా ఉంటుంది. అదే సమయంలో ఓటీసీ సబ్స్క్రిప్షన్లు, కరెంట్ బిల్లుల చెల్లింపుల కోసం ఇ-మాండేట్ను ఉపయోగిస్తున్న వినియోగదారులపై ఎలాంటి సర్వీస్ ఛార్జీలు లేదా అదనపు రుసుములు విధించవద్దని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది.
ఇంకా వినియోగదారుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఇన్సూరెన్స్ ప్రీమియంలు, మ్యూచువల్ ఫండ్ వాయిదాలు, క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులకు సంబంధించి రూ.1,00,000 వరకు ఓటీపీ లేకుండానే లావాదేవీలు చేయవచ్చని ఆర్బీఐ వెల్లడించింది. అదే సమయంలో ఇ-మాండేట్ లావాదేవీలపై వచ్చే ఫిర్యాదులను త్వరగా పరిష్కరించేందుకు పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని బ్యాంకులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది.
ప్రస్తుతం డిజిటల్ చెల్లింపుల వినియోగం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ఈ మార్పులు మరింత ప్రాముఖ్యత సంతరించుకున్నాయి. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ఫోన్ ఉండటం, నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ వంటి సేవలు విస్తృతంగా అందుబాటులోకి రావడం వల్ల రోజువారీ లావాదేవీలు పూర్తిగా డిజిటల్ వైపు మళ్లాయి. ఇంతకుముందు ప్రతి చెల్లింపుకు ఓటీపీ నమోదు చేయాల్సి రావడం వల్ల కొంత ఆలస్యం జరిగేది. కానీ ఇప్పుడు రూ.15,000 లోపు చెల్లింపులకు ఆ అవసరం లేకపోవడంతో లావాదేవీలు మరింత వేగంగా పూర్తవుతాయి.
ఈ కొత్త నిబంధనలు వినియోగదారులకు సమయాన్ని ఆదా చేయడమే కాకుండా, డిజిటల్ చెల్లింపులపై విశ్వాసాన్ని పెంచే దిశగా కీలక అడుగుగా భావిస్తున్నారు. భవిష్యత్తులో మరింత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన మార్పులు రావచ్చని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు.
ALSO READ: Travel: వైరల్ అవుతున్న రోడ్ మ్యాప్.. కాలినడకన భారత్ నుండి అమెరికాకు?