-
జనసేన ద్వారా అవకాశం
-
పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నారా? ఆయన జనసేన తరఫున రాజ్యసభకు వెళ్ళనున్నారా? పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో అల్లు అరవింద్ కు చాన్స్ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో అల్లు అరవింద్ పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.
నాలుగు పదవులు ఖాళీ..
ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ పదవులు ఖాళీ కానున్నాయి. జూన్లో వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్, పరిమల్ నత్వాని, టిడిపి సభ్యుడు సానా సతీష్ పదవీ విరమణ చేయనున్నారు. అయితే ఈ నాలుగు రాజ్యసభ స్థానాలు కూటమి ఖాతాలో పడనున్నాయి. ఎందుకంటే కూటమి ఏకపక్ష విజయం సాధించింది కాబట్టి. అయితే ఇందులో సానా సతీష్ ఏడాది కిందట రాజ్యసభకు నామినేట్ అయ్యారు. ఆయనకు పదవి ఇచ్చినప్పుడే మరోసారి కొనసాగిస్తామన్న హామీ ఇచ్చారు. అందుకే మరోసారి టిడిపి తరఫున సతీష్ కు ఛాన్స్ ఉంటుంది. అయితే మిగిలిన మూడు రాజ్యసభ పదవులు ఓటమి పార్టీలు పంచుకోనున్నాయి. అందులో జనసేనకు ఒక పదవి ఖాయమని ప్రచారం సాగుతోంది.
జనసేనకు తొలిప్రాతినిధ్యం..
జనసేనకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు. అయితే ఈసారి రాజ్యసభ పదవిని అల్లు అరవింద్ కు కేటాయించాలని పవన్ కళ్యాణ్ సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇప్పటివరకు లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆయన ప్రముఖ పారిశ్రామికవేత్త. జనసేనకు ఆర్థికంగా అండదండలు అందించారు. మరోవైపు ఏపీ సీఎం చంద్రబాబుకు సన్నిహితుడు కూడా. దీంతో జనసేన కు లభించే రాజ్యసభ పదవి లింగమనేని రమేష్ కు ఇస్తారని ప్రచారం నడిచింది. అయితే మారిన పరిస్థితుల నేపథ్యంలో అల్లు అరవింద్ పేరు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. దానికి అనేక రకాల కారణాలు ఉన్నాయి.
అప్పట్లో అల్లు అర్జున్ వివాదం..
మొన్నటి ఎన్నికల కు ముందు అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థికి మద్దతు తెలిపారు. అది వివాదానికి దారి తీసింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అల్లు అర్జున్ ను అడ్డం పెట్టుకొని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా విధాలుగా రాజకీయం చేసింది. మెగా ఫ్యామిలీతో అల్లు అర్జున్ కు విభేదాలు ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అల్లు ఫ్యామిలీని చిరంజీవి కుటుంబం నుంచి దూరం చేసే కుట్ర కూడా జరిగింది. పైగా ప్రజారాజ్యం సమయంలో అల్లు అరవింద్ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ఆయనకు ఎంపీ కావాలని కోరికగా ఉండేది. అందుకే చిరంజీవి ద్వారా అల్లు అరవింద్ ప్రయత్నించేసరికి పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో అల్లు అరవింద్ రాజ్యసభకు వెళ్లడం ఖాయమని ప్రచారం సాగుతోంది. అందులో ఎంత నిజం ఉందో తెలియాలి.