క్రైమ్ మిర్రర్ : నిజామాబాద్ నగరంలో గురువారం సాయంత్రం జరిగిన దారుణ హత్య కలకలం రేపింది. థియేటర్ సమీపంలో కూరగాయలు అమ్మే ప్రాంతానికి కారులో వచ్చిన ముగ్గురు వ్యక్తులు హరిబాబు అనే వ్యక్తిపై కత్తితో దాడి చేసి హత్య చేసినట్లు పోలీసులు చెపుతున్నారు. నిందితులు ముందస్తు పక్కా పథకం ప్రకారమే కొబ్బరికాయలు కోసే కత్తితో దాడి చేయడంతో హరిబాబు అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. హత్య సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) మార్చురీకి తరలించారు. నగర ఏసీపీ ప్రకాశ్ సంఘటనా స్థలాన్ని పరిశీలించి ఘటనకు సంబంధించిన వివరాలను ఆరా తీశారు.
కారులో వచ్చి.. హత్య చేసి అదే కారులో పరార్
ముగ్గురు వ్యక్తులు కారులో సంఘటనా స్థలానికి వచ్చి క్షణాల వ్యవధిలో హరిబాబుపై దాడి చేసినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలినట్లు సమాచారం. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి అదే కారులో పరారైనట్లు తెలుస్తోంది. నిందితులు ఇతర జిల్లాకు చెందిన వారిగా పోలీసులు చెపుతున్నారు. నిందితుల కోసం ప్రత్యేక గాలింపు బృందాలు
పోలీసు శాఖకు సవాల్ గా మారిన ఈ హత్య కేసులో నిందితులను గుర్తించి పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆ బృందాలు సాంకేతికతను ఆధారంగా చేసుకుని నిందితుల ఆచూకీని కనిపెట్టే పనిలో ఉన్నట్లు సమాచారం.
